
అబుదాబి: యుజ్వేంద్ర చాహల్(2/18), షాబాజ్ అహ్మద్ (2/10), హర్షల్ పటేల్(3/34) బంతితో చెలరేగడంతో రాజస్థాన్ బ్యాట్స్మన్ విలవిలలాడారు. దాంతో ఆ జట్టు.. ఆర్సీబీ ముందు 150 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 రన్స్ చేసింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్(37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 58), యశస్వీ జైస్వాల్(22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 31) మినహా అంతా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. చాహల్, షాబాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. డాన్ క్రిస్టియన్ ఓ వికెట్ తీశాడు. ఓ దశలో 100/2తో మెరుగైన స్థితిలో నిలిచిన రాజస్థాన్.. భారీ స్కోర్ చేస్తుందని అంతా భావించారు. కానీ ఆర్సీబీ స్పిన్ ద్వయం చాహల్, షాబాజ్ అద్భుత బౌలింగ్తో రాజస్థాన్ భారీ స్కోర్ను అడ్డుకున్నారు. తమ స్పిన్ ఉచ్చులో బిగించేసారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్కు ఓపెనర్లు ఎవిన్ లూయిస్, యశస్వీ జైస్వాల్ మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్కు 77 పరుగులు జోడించారు. తొలి రెండు ఓవర్లు నిదానంగా ఆడిన ఈ జోడీ.. మ్యాక్స్వెల్ వేసిన మూడో ఓవర్ నుంచి హిట్టింగ్ షురూ చేసింది. ప్రతీ ఓవర్లో బౌండరీలతో విరుచుకుపడటంతో రాజస్థాన్ రాయల్స్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని డాన్ క్రిస్టియన్ విడదీశాడు. స్లోయర్ బాల్తో యశస్వీ జైస్వాల్ను బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత క్రీజులోకి కెప్టెన్ సంజూ శాంసన్ రాగా.. ఎవిన్ లూయిస్ తన జోరు కొనసాగించాడు. ఈ క్రమంలో అతను హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అతన్ని అరంగేట్ర పేసర్ జార్జ్ గార్టన్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు.
లూయిస్ ఔటయ్యే సమయానికి రాజస్తాన్ 11.2 ఓవర్లలో రెండు వికెట్లకు 100 పరుగులతో మెరుగైన దశలో కనిపించింది. కానీ అనూహ్యంగా రాజస్థాన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, షాబాజ్ రఫ్ఫాడించడంతో బ్యాట్స్మన్ పెవిలియన్కు క్యూ కట్టారు. సంజూ శాంసన్ను(19) షాబాజ్ క్యాచ్ ఔట్ చేయగా.. మహిపాల్(3)ను చాహల్ స్టంపౌట్ చేశాడు. ఆ వెంటనే రాహుల్ తెవాటియాను షాబాజ్ అహ్మద్ పెవిలియన్ చేర్చగా.. లివింగ్ స్టోన్ను చాహల్ బోల్తా కొట్టించాడు. దాంతో రాజస్థాన్ 127 పరుగలకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో మోరీస్, రియాన్ పరాగ్ స్కోర్ను పెంచే ప్రయత్నం చేశారు. కానీ ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో భారీ షాట్లు ఆడలేకపోయారు. ఇక హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో రియాన్ పరాగ్(9), క్రిస్ మోరీస్14) వరుస బంతుల్లో ఔటవ్వగా.. ఆఖరి బంతికి చేతన్ సకారియా ఔటయ్యాడు. చివరి 58 బంతుల్లో 7 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ కేవలం 49 పరుగులు మాత్రమే చేసింది.