ఐపీఎల్ 2024 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పోరాటం ముగిసింది. అసాధారణ ప్రదర్శనతో వరుసగా 6 విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ.. కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది. రాజస్థాన్ రాయల్స్తో బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ నాకౌట్ మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
మరోవైపు అసాధారణ ప్రదర్శనతో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. చెన్నై వేదికగా శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 33), రజత్ పటీదార్(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 34), మహిపాల్ లోమ్రోర్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 32 నాటౌట్) రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్(3/44) మూడు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు వికెట్లు తీసాడు. యుజ్వేంద్ర చాహల్, ఆవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. యశస్వి జైస్వాల్(30 బంతుల్లో 8 ఫోర్లతో 45), రియాన్ పరాగ్(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 36), షిమ్రాన్ హెట్మైర్(14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 26) సత్తా చాటారు. చివర్లో రోవ్మన్ పోవెల్(8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 16 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
ఆర్సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/33) రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్ తలో వికెట్ తీసారు.
చెలరేగిన యశస్వి..
173 పరుగుల సాధారణ లక్ష్య చేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లెర్(20) దూకుడుగా ఆడారు. అయితే ఆరంభంలోనే ఈ ఇద్దరు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. యశస్వి జైస్వాల్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను కామెరూన్ గ్రీన్ నేలపాలు చేయగా.. టామ్ కోహ్లేర్ ఇచ్చిన సునాయస క్యాచ్ను మ్యాక్స్వెల్ విడిచిపెట్టాడు.
అయితే ఫెర్గూసన్ స్టన్నింగ్ యార్కర్తో టామ్ కోహ్లెర్ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం హాఫ్ సెంచరీకి చేరువైన యశస్వి జైస్వాల్ను కామెరూన్ గ్రీన్ కీపర్ క్యాచ్గా ఔట్ చేశాడు. ఆ వెంటనే సంజూ శాంసన్ను కర్ణ్ శర్మ స్టంప్ ఔట్ చేయడంతో రాజస్థాన్ 10 ఓవర్లలో 3 వికెట్లకు 86 పరుగులు చేసింది.
పరాగ్, హెట్మైర్ దూకుడు..
ఈ పరిస్థితుల్లో రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. కానీ విరాట్ కోహ్లీ స్టన్నింగ్ త్రోకు ధ్రువ్ జురెల్(8) రనౌట్గా వెనుదిరిగాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ షిమ్రాన్ హెట్మైర్, రియాన్ పరాగ్ భారీ షాట్లతో ఒత్తిడి తగ్గించారు. గ్రీన్ వేసిన 16వ ఓవర్లో 17 పరుగులు పిండుకున్న ఈ జోడీ.. మ్యాచ్ను తమవైపు తిప్పుకుంది.
సిరాజ్ చెలరేగినా..
యశ్ దయాల్ వేసిన 17వ ఓవర్లో 11 పరుగులు రావడంతో రాజస్థాన్ విజయ సమీకరణం మరింత సులువైంది. కానీ 18వ ఓవర్లో సిరాజ్ స్టన్నింగ్ యార్కర్తో రియాన్ పరాగ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్ ఆఖరి బంతికి హెట్మైర్(26) కూడా పెవిలియన్ చేర్చి మ్యాచ్ను మరింత ఉత్కంఠగా మార్చాడు.
చివరి 12 బంతుల్లో 13 పరుగులు అవసరమవ్వగా.. ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్లో రోవ్మన్ పోవెల్ వరుసగా రెండు బౌండరీలు బాది ఒత్తిడిని తగ్గించాడు. తర్వాతి రెండు బంతులను డాట్ చేసినా.. ఆఖరి బంతిని సిక్సర్ బాదిన పోవెల్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.