అసలేం జరిగిందంటే..?
ఆర్సీబీ ఇన్నింగ్స్ 9వ ఓవర్లో కార్తీక్ త్యాగీ వేసిన 5వ బంతిని గ్లేన్ మ్యాక్స్వెల్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫైన్ లెగ్ దిశగా సిక్సర్గా దూసుకెళ్లింది. దాదాపు సిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ గాల్లో సూపర్ మ్యాన్లా లేచిన ముస్తాఫిజుర్ బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. చేతికి చిక్కకపోవడంతో చాకచక్యంగా మైదానంలోకి నెట్టేసాడు. ఇక సిక్స్ పక్కా అనుకున్న మ్యాక్సీ.. పరుగులు తీయకుండా లైట్ తీసుకున్నాడు. దాంతో సిక్స్ కాస్త సింగిల్గా మారింది.

అద్భుత విజయం..
గ్లేన్ మ్యాక్స్వెల్( 30 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీకి శ్రీకర్ భరత్(35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 44) క్లాస్ ఇన్నింగ్స్ తోడవ్వడంతో ఈ మ్యాచ్లో ఆర్సీబీ అద్భుత విజయాన్నందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 రన్స్ చేసింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్(37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 58), యశస్వీ జైస్వాల్(22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 31) మినహా అంతా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. చాహల్, షాబాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. డాన్ క్రిస్టియన్ ఓ వికెట్ తీశాడు. ఓ దశలో 100/2తో మెరుగైన స్థితిలో నిలిచిన రాజస్థాన్.. భారీ స్కోర్ చేస్తుందని అంతా భావించారు. కానీ ఆర్సీబీ స్పిన్ ద్వయం చాహల్, షాబాజ్ అద్భుత బౌలింగ్తో రాజస్థాన్ భారీ స్కోర్ను అడ్డుకున్నారు. తమ స్పిన్ ఉచ్చులో బిగించేసారు.

రాణించిన ఓపెనర్లు..
అనంతరం ఆర్సీబీ 17.1 ఓవర్లలోనే 3 వికెట్లకు 153 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. మ్యాక్సీ, భరత్తో పాటు విరాట్ కోహ్లీ(25), దేవదత్ పడిక్కల్(22) రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీశాడు. 150 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ మంచి శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్కు 48 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని ముస్తాఫిజుర్ రెహ్మాన్ విడదీసాడు. పడిక్కల్ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రీజులోకి తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ రాగా.. పవర్ ప్లే ముగిసే సమయానికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 54 రన్స్ చేసింది. అయితే ఆ వెంటనే కెప్టెన్ విరాట్ కోహ్లీ లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు.

మ్యాడ్ మ్యాక్సీ..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చి మ్యాడ్ మ్యాక్సీ నిదానంగా తన ఆటను ప్రారంభించాడు. మరోవైపు తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ తన క్లాస్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. క్విక్ సింగిల్స్, డబుల్స్తో పాటు వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన భరత్.. ముస్తాఫిజుర్ వేసిన షార్ట్ పిచ్ బంతికి క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరాడు. తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నా జట్టు విజయానికి కావాల్సిన విలువైన పరుగులు చేశాడు. ఆ తర్వాత ఏబీడీ క్రీజులోకి రాగా.. మ్యాడ్ మ్యాక్సీ తన విశ్వరూపం చూపించాడు. మోరిస్ వేసిన 17వ ఓవర్లో ఓ సిక్స్, మూడు బౌండరీలతో స్కోర్లు సమం చేశాడు. ఈ క్రమంలో 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రియాన్ పరాగ్ వేసిన మరుసటి ఓవర్ ఫస్ట్ బాల్నే బౌండరీకి పూర్తి చేసిన ఏబీడీ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.


Click it and Unblock the Notifications












