
వణికించిన చాహల్..
ముఖ్యంగా యుజ్వేంద్ర చాహల్.. ఆర్సీబీని వణికించాడు. ఓటమి అంచుల్లోకి తీసుకెళ్లాడు. సూపర్ బాల్తో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (20 బంతుల్లో 5 ఫోర్లతో 29)ను క్యాచ్ ఔట్ చేసిన చాహల్.. తన మరుసటి ఓవర్లో ఆర్సీబీకి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ముందుగా విరాట్ కోహ్లీ(5)ని రనౌట్ చేసి ఆ మరుసటి బంతికే డేవిడ్ విల్లే(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే షెఫెర్డ్ రూథర్ఫోర్డ్(5) కూడా ఔటవ్వడంతో ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. చాహల్(2/14)తన డెడ్లీ స్పెల్తో బెంగళూరును ఉక్కిరిబిక్కిరి చేశాడు. నాలుగు ఓవర్లు వేసిన చాహల్.. 14 రన్సే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దాంతో ఆర్సీబీ ఓటమి ఖాయమని అంతా భావించారు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ కూడా ఇదే అనుకున్నారు.

ఊపిరి పోసిన అశ్విన్..
చాహల్ దెబ్బకు 87/5తో ఓటమి అంచున చేరిన ఆర్సీబీకి.. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 14వ ఓవర్ ఊపిరి పోసింది. అప్పుడే క్రీజులోకి వచ్చిన కార్తీక్.. ఆ ఓవర్ మూడో బంతిని ఫైన్ లెగ్ దిశగా బౌండరీ తరలించాడు. అయితే అది నో బాల్ కావడంతో మరుసటి బంతి ఫ్రీ హిట్ కావడంతో స్వేచ్చగా సిక్స్ బాదాడు. దాంతో మూమెంటమ్ అందుకున్న అతను మరో రెండు బౌండరీలు బాది 21 పరుగులు పిండుకున్నాడు. దాంతో మ్యాచ్ ఒక్కసారి ఆర్సీబీ వైపు మళ్లీంది. ఈ ఓవర్ను అశ్విన్ కాస్త కట్టుదిట్టంగా వేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. మొత్తానికి అశ్విన్ ఘోర తప్పిదం రాజస్థాన్కు తీరని నష్టం చేకూర్చింది. ఆర్సీబీ విజయానికి ఇదే టర్నింగ్ పాయింట్గా నిలిచింది.

చెలరేగిన కార్తీక్, షెబాజ్..
ఈ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. జోస్ బట్లర్(47 బంతుల్లో 6 సిక్స్లతో 70 నాటౌట్) మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. హెట్మైర్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 42 నాటౌట్), దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 37) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లే, హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్సీబీ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్(23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 43 నాటౌట్), షెబాజ్ అహ్మద్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 45) విరోచితన బ్యాటింగ్తో ఆర్సీబీకి తిరుగులేని విజయాన్నందించారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, బౌల్ట్ రెండేసి వికెట్లు తీయగా.. నవ్దీప్ సైనీ ఓ వికెట్ పడగొట్టాడు.


Click it and Unblock the Notifications
