
ముంబై: జోస్ బట్లర్(47 బంతుల్లో 6 సిక్స్లతో 70 నాటౌట్) మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ముందు రాజస్థాన్ రాయల్స్ 170 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక బట్లర్కు హెట్మైర్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 42 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 37) రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో డేవిడ్ విల్లే, హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ను తొలి ఓవర్లోనే డేవిడ్ విల్లే సూపర్ బాల్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్తో జోస్ బట్లర్ ఆచితూచి ఆడాడు. పిచ్ బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉండటంతో రిస్కీ షాట్స్ ఆడకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఇక బట్లర్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను ఆకాశ్ దీప్ నేలపాలు చేయగా.. రాజస్థాన్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది.
ఆ తర్వాత కూడా ఇదే జోరు కొనసాగించిన ఈ జోడీని హర్షల్ పటేల్ విడదీసాడు. స్లోయర్ బాల్తో దేవదత్ పడిక్కల్ను పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్కు నమోదైన 70 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చి సిక్సర్తో దూకుడు కనబర్చిన కెప్టెన్ సంజూ శాంసన్(8)ను హసరంగా గూగ్లీతో బోల్తా కొట్టించాడు. ఈ పరిస్థితుల్లో బట్లర్కు జత కలిసిన హెట్మైర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
ఈ ఇద్దరు కలిసి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మ్యాచ్లోకి డ్యూ రావడంతో పరిస్థితులు బ్యాటింగ్కు అనుకూలంగా మారాయి. సిరాజ్ వేసిన 19వ ఓవర్లో బట్లర్ రెండు సిక్స్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో బట్లర్ రెండు సిక్స్లు బాదగా.. హెట్మైర్ మరో భారీ సిక్స్ కొట్టడంతో రాజస్థాన్ 169 పరుగులు చేయగలిగింది.