ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్(47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 75) మరో హాఫ్ సెంచరీతో రాణించాడు. దాంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్తో పాటు రియాన్ పరాగ్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 30), ధ్రువ్ జురెల్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హజెల్ వుడ్, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీసారు.
జిడ్డు బ్యాటింగ్..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ తమ ఇన్నింగ్స్ను నెమ్మదిగా ప్రారంభించింది. పిచ్ బౌలింగ్కు అనుకూలంగా ఉండటంతో రాజస్థాన్ ఓపెనర్లు సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ ఆచితూచి ఆడారు. యశస్వి దూకుడుగా ఆడినా.. సంజూ తీవ్రంగా తడబడ్డాడు. దాంతో పవర్ ప్లేలో రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 45 పరుగులే చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే స్పిన్నర్ కృనాల్ పాండ్యాను రంగంలోకి దించిన రజత్ పటీదార్.. ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. సంజూ శాంసన్ను కృనాల్ స్టంపౌట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రియాన్ పరాగ్తో కలిసి యశస్వి తన దూకుడు కొనసాగించాడు.

సుయాశ్ శర్మ వేసిన 10వ ఓవర్లో వరుస బంతుల్లో జైస్వాల్, రియాన్ పరాగ్ ఇచ్చిన క్యాచ్లను ఆర్సీబీ ఆటగాళ్లు నేలపాలు చేశారు. ఆర్సీబీ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ పరుగుల వేగం తగ్గింది. కృనాల్ పాండ్యా వేసిన 13వ ఓవర్ తొలి బంతిని సింగిల్ తీసిన జైస్వాల్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్ ఆఖరి బంతికి జైస్వాల్ కొట్టిన భారీ సిక్సర్ను బౌండరీ లైన్పై ఫిల్ సాల్ట్ అడ్డుకున్నాడు.
కొంపముంచిన కోహ్లీ
సూపర్ మ్యాన్లా గాల్లోకి ఎగిరి బంతిని పట్టి గ్రౌండ్లోకి విసిరేసాడు. దాంతో సిక్సర్ కాస్త సింగిల్గా మారింది. రియాన్ పరాగ్(30)ను యశ్ దయాల్ ఔట్ చేయగా.. జైస్వాల్ ఇచ్చిన మరో కష్టతరమైన క్యాచ్ను లివింగ్ స్లోన్ వదిలేసాడు. జైస్వాల్ను హజెల్ వుడ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చగా.. 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధ్రువ్ జురెల్ ఇచ్చిన సునాయస క్యాచ్ను విరాట్ కోహ్లీ చేజార్చాడు. ఈ అవకాశంతో అతను చెలరేగాడు. భారీ షాట్లతో 35 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు 173 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించాడు.