ఐపీఎల్ 2024 సీజన్లో అంపైర్ల ఘోర తప్పిదాలు కొనసాగుతున్నాయి. టెక్నాలజీ అందుబాటులో ఉన్నా థర్డ్ అంపైర్లు బ్లండర్ మిస్టేక్ చేస్తున్నారు. రీప్లేలను ఓపికగా పరిశీలించకుండా నిర్ణయాలు ప్రకటిస్తూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య బుధవారం జరిగిన కీలక ఎలిమినేటర్ మ్యాచ్లో థర్డ్ అంపైర్ ఘోర తప్పిదం చేశాడు.
ఆర్సీబీ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఎల్బీడబ్ల్యూ విషయంలో థర్డ్ అంపైర్ అనిల్ చౌదరి ప్రకటించిన నిర్ణయంపై దుమారం రేగుతోంది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో దినేశ్ కార్తీక్ వికెట్ల ముందు దొరికిపోగా.. ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. దినేశ్ కార్తీక్ రివ్యూ తీసుకోగా.. రిప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ అనిల్ చౌదరి.. బంతి బ్యాట్ను తాకిందని నాటౌటిచ్చాడు.

అయితే బంతి బ్యాట్ను తాకి ప్యాడ్ను తాకిందని థర్డ్ అంపైర్ వివరణ ఇచ్చాడు. కానీ బ్యాట్ను బంతి తాకినట్లు స్పష్టమైన ఆధారం కనిపించలేదు. స్నికో మీటర్ స్పైక్ వచ్చిందని థర్డ్ అంపైర్ చెప్పినప్పటికీ.. అది ప్యాడ్కు బ్యాట్ తాకడంతో వచ్చిందని దిగ్గజ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ వివరించాడు.
సునీల్ గవాస్కర్తో పాటు మైకేల్ వాన్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పాడు. ఇది ఔటేనని స్పష్టం చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు సైతం ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ జట్టు హెడ్ కోచ్ కుమార సంగక్కర అయితే టీవీ అంపైర్ దగ్గరకు వెళ్లి నిలదీసే ప్రయత్నం చేశాడు.
అయితే దినేశ్ కార్తీక్(13 బంతుల్లో 11) పెద్దగా రాణించకపోవడంతో అంపైర్ తప్పిదంతో రాజస్థాన్ రాయల్స్కు ఎలాంటి నష్టం జరగలేదు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 33), రజత్ పటీదార్(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 34), మహిపాల్ లోమ్రోర్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 32 నాటౌట్) రాణించారు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్(3/44) మూడు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ రెండు వికెట్లు తీసాడు. యుజ్వేంద్ర చాహల్, ఆవేశ్ ఖాన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ తీసారు. కీలక సమయంలో గ్లేన్ మ్యాక్స్వెల్(0) గోల్డెన్ డక్గా వెనుదిరగడం.. దినేశ్ కార్తీక్(11) దారుణంగా విఫలమవ్వడం ఆర్సీబీ కొంపముంచింది.