గువహతి: ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్(56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 86 నాటౌట్ ) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. తనదైన సిక్సర్లతో పాత ధావన్ను తలపించాడు. అతనికి తోడుగా యువ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 60) హాఫ్ సెంచరీతో రాణించడంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 197 పరుగులు చేసింది. గబ్బర్ ధాటికి రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు తేలిపోయారు. జాసన్ హోల్డర్ ఒక్కడే రెండు వికెట్లు తీయగా.. అశ్విన్,, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు ఓపెనర్లు ధావన్, ప్రభ్సిమ్రాన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే ప్రభ్సిమ్రాన్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. శిఖర్ ధావన్ యాంకర్ రోల్ పోషించాడు. దాంతో పవర్ ప్లేలోనే పంజాబ్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రభ్ సిమ్రాన్ ఇచ్చిన క్యాచ్ను దేవదత్ పడిక్కల్ నేలపాలు చేశాడు.

ఈ అవకాశంతో చెలరేగిన ప్రభ్సిమ్రాన్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జాసన్ హోల్డర్.. జోస్ బట్లర్ స్టన్నింగ్ క్యాచ్ సాయంతో విడదీసాడు. ప్రభుసిమ్రాన్ సింగ్ను పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 90 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స(1) అనూహ్యంగా గాయపడి రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. జితేశ్ శర్మ సాయంతో శిఖర్ ధావన్ ధాటిగా ఆడి 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వేగంగా ఆడే క్రమంలో జితేశ్ శర్మ(27) ఔటైనా.. సికిందర్ రాజా(1) విఫలమైనా షారూఖ్ ఖాన్తో కలిసి ధావన్ ధాటిగా ఆడాడు. అయితే చివరి ఓవర్ను జాసన్ హోల్డర్ కట్టడిగా వేయడంతో పాటు షారూఖ్ ఖాన్ను ఔట్ చేయడంతో పంజాబ్ 200 పరుగుల మార్క్ను అందుకోలేకపోయింది.