గువహతి: ఐపీఎల్ 2023 సీజన్లో పంజాబ్ కింగ్స్ మరో విజయాన్నందుకుంది. రాజస్థాన్ రాయల్స్తో బుధవారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పంజాబ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. పంజాబ్ రూ.18 కోట్ల ఆటగాడు సామ్ కరణ్ సూపర్ బౌలింగ్తో ఆ జట్టు ఓటమిని తప్పించుకుంది. సామ్ కరణ్ ఒక్క వికెట్ తీయకపోయినా.. ఆఖరి ఓవర్లో 16 పరుగులను అద్భుతంగా డిఫెండ్ చేశాడు. మరోవైపు దేవదత్ పడిక్కల్(26 బంతుల్లో 21) జిడ్డు బ్యాటింగ్ రాజస్థాన్ రాయల్స్ విజయవకాశాలను దెబ్బతీసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 197 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్(56 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 86 నాటౌట్ ) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా... యువ ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్(34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 60) అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్ ఒక్కడే రెండు వికెట్లు తీయగా.. అశ్విన్,, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. సంజూ శాంసన్(25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 42), షిమ్రాన్ హెట్మైర్(18 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 36), ధృవ్ జురెల్(15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 32 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 4 వికెట్లు తీయగా.. అర్ష్దీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టాడు.
భారీ లక్ష్య చేధనలో రాజస్థాన్ రాయల్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. అర్ష్దీప్ సింగ్ ధాటికి ఓపెనర్లుగా బరిలోకి దిగిన యశస్వీ జైస్వాల్(11), రవి చంద్రన్ అశ్విన్(0) దారుణంగా విఫలమయ్యారు. క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన జోస్ బట్లర్(19) ఓ సిక్సర్, బౌండరీతో జోరు కనబర్చినా.. రిటర్న్ క్యాచ్తో నాథన్ ఎల్లిస్ పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలో రాజస్థాన్ 3 వికెట్లకు 57 పరుగులు చేసింది.
అనంతరం క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్తో కెప్టెన్ సంజూ శాంసన్ ధాటిగా ఆడాడు. తనదైన శైలిలో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే పడిక్కల్ నుంచి సరైన సహకారం అందకపోవడంతో ఒత్తిడికి గురైన సంజూ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్(20) మెరుపులు మెరిపించినా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు.
నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. అదే ఓవర్లో దేవదత్ పడిక్కల్(21) కూడా ఔటవ్వడంతో మ్యాచ్ పంజాబ్ వైపు మళ్లింది. కానీ షిమ్రాన్ హెట్మైర్, ధృవ్ జురెల్.. సామ్ కరన్ వేసిన 18వ ఓవర్లో 19 పరుగులు పిండుకొని రేసులోకి వచ్చారు. అర్ష్దీప్ వేసిన 19వ ఓవర్లో ఈ జోడీ 18 పరుగులు పిండుకోగా.. ఆఖరి బంతికి హెట్మైర్ ఇచ్చిన క్యాచ్ను నాథన్ ఎల్లిస్ నేలపాలు చేశాడు.
చివరి 6 బంతుల్లో రాజస్థాన్ విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా.. సామ్ కరణ్ కట్టడిగా బౌలింగ్ చేయడంతో హెట్మైర్ డబుల్ కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. క్రీజులోకి జాసన్ హోల్డర్ రాగా.. రాజస్థాన్ విజయానికి 2 బంతుల్లో 12 పరుగులు అవసరమయ్యాయి. కానీ సామ్ కరణ్ 5 పరుగులే ఇచ్చి పంజాబ్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.