రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే 200 వికెట్లు తీసిన తొలి బౌలర్గా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో యుజ్వేంద్ర చాహల్ ఈ ఫీట్ సాధించాడు. మహమ్మద్ నబీని రిటర్న్ క్యాచ్గా పెవిలియన్ చేర్చడం ద్వారా ఐపీఎల్లో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు.
17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటగా ఆర్పీ సింగ్ 50 వికెట్ల ఘనతను అందుకోగా.. లసిత్ మలింగా 100 వికెట్లు, 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 2010లో ఆర్పీ సింగ్ 50 వికెట్ల ఫీట్ సాధిస్తే.. మలింగా 2013లో 100, 2017లో 150 వికెట్ల ఫీట్ను పూర్తి చేశాడు. తాజా మ్యాచ్లో చాహల్ 200 వికెట్ల ఘనతను అందుకున్నాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 179 పరుగులు చేసింది. తెలుగు తేజం తిలక్ వర్మ(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 65) హాఫ్ సెంచరీతో రాణించగా.. యువ ప్లేయర్ నెహాల్ వదేరా(24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 49) సత్తా చాటాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ 5 వికెట్లతో ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించగా.. ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీసాడు. అశ్విన్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.