
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్కు మరో ఓటమి తప్పలేదు. రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో లక్నో 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్లో లక్నో టీమ్ విజయానికి 14 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో డేంజరస్ మార్కస్ స్టోయినిస్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 38 నాటౌట్) ఉన్నాడు. పైగా ప్రసిధ్ కృష్ణ వేసిన 19వ ఓవర్లో అతను రెండు భారీ సిక్సర్లతో పాటు బౌండరీ బాది 19 పరుగులు పిండుకున్నాడు. పైగా ఆఖరి ఓవర్ను అంతగా అనుభవం లేని కుల్దీప్ సేన్కు సంజూ శాంసన్ ఇవ్వడంతో లక్నో విజయం ఖాయమని అంతా అనుకున్నారు.
కానీ కుల్దీప్ సేన్ ఇక్కడ అద్భుతం చేశాడు. వరుసగా మూడు బంతులను డాట్స్ చేసి రాజస్థాన్కు చిరస్మరణీ విజయాన్నందించాడు. తొలి బంతికి ఆవేశ్ ఖాన్ సింగిల్ తీయగా.. మార్కస్ స్టోయినీస్ స్ట్రైకింగ్లోకి వచ్చాడు. ఔట్సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్తో కుల్దీప్ సేన్ మూడు డాట్ బాల్స్ వేసాడు. ఇక స్టోయినీస్ ఐదో బంతికి ఫోర్, చివరి బంతికి సిక్స్ కొట్టినా ఫలితం లేకపోయింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. షిమ్రన్ హెట్మైర్(36 బంతుల్లో ఫోర్, 6 సిక్సర్లతో 59 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. దేవదత్ పడిక్కల్(29 బంతుల్లో 4 ఫోర్లతో 29), రవిచంద్రన్ అశ్విన్(23 బంతుల్లో 2 సిక్స్లతో 28) రాణించారు. లక్నో బౌలర్లలో జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్ రెండేసి వికెట్లు తీసారు. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. మార్కస్ స్టోయినీస్, క్వింటన్ డికాక్(32 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 39)టాప్ స్కోరర్లుగా నిలవగా.. దీపక్ హుడా(24 బంతుల్లో 3 ఫోర్లతో 25), కృనాల్ పాండ్యా(15 బంతుల్లో 2 ఫోర్లతో 22) విలువైన పరుగులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లతో సత్తా చాటగా.. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రసిధ్, కుల్దీప్ సేన్కు తలో వికెట్ దక్కింది. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ తొలి రెండు బంతులకే ఓపెనర్ కేఎల్ రాహుల్(0), ఫస్ట్ డౌన్ బ్యాట్స్మన్ కృష్ణప్ప గౌతమ్(0) గోల్డెన్ డక్లుగా వెనుదిరగడం టీమ్ కొంపముంచింది.