ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్తో శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన లక్నో 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్.. అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజాను అందించింది. సునాయసంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్ చేజేతులా చేజార్చుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్రమ్(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 66), ఆయుష్ బదోని(34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించగా.. అబ్దుల్ సమద్(10 బంతుల్లో 4 సిక్స్లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో వానిందు హసరంగా(2/31) రెండు వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, తుషార్ దేశ్పాండే, జోఫ్రా ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 74), వైభవ్ సూర్యవంశీ(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 34), రియాన్ పరాగ్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 39) రాణించినా ఫలితం లేకపోయింది. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్(3/37) మూడు వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించగా.. శార్దూల్ ఠాకూర్, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ తీసారు.
మలుపు తిప్పిన ఓవర్
చివరి 18 బంతుల్లో రాజస్థాన్ విజయానికి 25 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో సెట్ అయిన యశస్వి జైస్వాల్తో రియాన్ పరాగ్ ఉండటంతో రాజస్థాన్ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ 18వ ఓవర్ వేసిన ఆవేశ్ ఖాన్ తొలి బంతికి యశస్వి జైస్వాల్.. ఆఖరి బంతికి రియాన్ పరాగ్ను ఔట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. అంతేకాకుండా ఈ ఓవర్లో 5 పరుగులే ఇచ్చాడు.
19వ ఓవర్ వేసిన ప్రిన్స్ యాదవ్ 11 పరుగులివ్వడంతో ఆఖరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్లో ఆవేశ్ ఖాన్.. మూడో బంతికి హెట్మైర్ను ఔట్ చేసి.. తర్వాతి మూడు బంతులకు మూడు పరుగులే ఇచ్చి లక్నోకు సంచలన విజయాన్నందించాడు. ఆవేశ్ ఖాన్ అద్భుత ప్రదర్శన మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది.