ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మరోసారి విజయం ముంగిట బోల్తా కొట్టింది. శనివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో లక్నో 2 పరుగులు తేడాతో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది. ఎయిడెన్ మార్క్రమ్(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 66), ఆయుష్ బదోని(34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్లతో 50), అబ్దుల్ సమద్(10 బంతుల్లో 4 సిక్స్లతో 30 నాటౌట్) సత్తా చాటడంతో ముందుగా లక్నో సూపర్ జెయింట్స్ 5 వికెట్లకు 180 పరుగులు చేసింది.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్లకు 178 పరుగులే చేసి ఓటమిపాలైంది. యశస్వి జైస్వాల్(52 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 74), వైభవ్ సూర్యవంశీ(20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 34), రియాన్ పరాగ్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 39) రాణించినా ఫలితం లేకపోయింది. లక్నో పేసర్ ఆవేశ్ ఖాన్(3/37) మూడు వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించాడు.

18వ ఓవర్లో జైస్వాల్, రియాన్ పరాగ్లను ఔట్ చేసిన ఆవేశ్ ఖాన్ 5 పరుగులే ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో అద్భుతమైన యార్కర్లతో 9 పరుగులను డిఫెండ్ చేసి లక్నోకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. దాంతో ఆవేశ్ ఖాన్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మ్యాచ్ విన్నర్ ఆవేశ్ ఖాన్ అంటూ నెటిజన్లు, మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. కానీ ఆవేశ్ ఖాన్ కంటే.. అబ్దుల్ సమద్కు ఈ గెలుపు క్రెడిట్ ఇవ్వాలని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
సందీప్ శర్మ వేసిన ఆఖరి ఓవర్లో అతను నాలుగు సిక్స్లు(6, 6, 2, 6, 6)బాది 27 పరుగులు పిండుకున్నాడు. ఈ విధ్వంసకర బ్యాటింగ్తోనే 160 పరుగులకే పరిమితం కావాల్సిన లక్నో 181 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. 10 బంతుల్లో 30 పరుగులు చేసిన అబ్దుల్ సమద్ కనుక విఫలమై ఉంటే లక్నో తక్కువ స్కోర్కే పరిమితమయ్యేది. అప్పుడు రాజస్థాన్ సునాయసంగా గెలిచేది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు అబ్దుల్ సమద్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసినా.. ఆ పోరాడే లక్ష్యాన్ని ఇచ్చింది అబ్దుల్ సమద్ అని, కానీ అతని గురించి ఎవరూ మాట్లాడటం లేదని నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.