నాగ్పూర్: ఐపీఎల్ 2023 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మరో విజయాన్నందుకుంది. రాజస్థాన్ రాయల్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆవేశ్ ఖాన్(3/25) అద్భుత బౌలింగ్తో లోస్కోరింగ్ గేమ్లో లక్నో ఓటమి నుంచి గట్టెక్కింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 154 పరుగులు చేసింది. కైల్ మేయర్స్(42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీతో రాణించగా.. కేఎల్ రాహుల్(32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 39), నికోలస్ పూరన్(20 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29) పర్వాలేదనిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, జాసన్ హోల్డర్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులే చేసింది. యశస్వీ జైస్వాల్(35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 44), జోస్ బట్లర్(41 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 40) రాణించినా ఫలితం లేకపోయింది. ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లు, మార్కస్ స్టోయినీస్ రెండు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించారు.
155 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ మంచి శుభారంభం అందించారు. ఈ ఇద్దరూ ఆచితూచిగా ఆడటంతో పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. అనంతరం ధాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మార్కస్ స్టోయినీస్ విడదీసాడు. యశస్వీ జైస్వాల్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చి తొలి వికెట్కు నమోదైన 87 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్(2) రనౌటవ్వగా.. జోస్ బట్లర్ను మార్కస్ స్టోయినీస్ పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్దిసేపటికే విధ్వంసకర హిట్టర్ షిమ్రాన్ హెట్మైర్(2)ను ఆవేశ్ ఖాన్ ఔట్ చేసాడు. ఆ వెంటనే క్రీజులో సెట్ అయిన దేవదత్ పడిక్కల్ను కూడా ఆవేశ్ ఖాన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రాజస్థాన్ పతనం ఖాయమైంది. చివరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 19 పరుగులు అవసరమవ్వగా.. ఆవేశ్ ఖాన్ పడిక్కల్తో పాటు జురేల్ను ఔట్ చేసి లక్నోవిజయాన్ని ఖాయం చేశారు.