ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. షెడ్యూల్ ప్రకారం గువహతి వేదికగా రాత్రి 7 గంటలకే ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్.. వర్షం కారణంగా ఇంకా మొదలవ్వలేదు. కనీసం టాస్ కూడా పడలేదు.
భారీ వర్షం రావడంతో మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పేసారు. వర్షం దాగుడు మూతలు ఆడుతుండటంతో మ్యాచ్ జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం అక్కడ వర్షం ఆగిపోగా.. మైదానా సిబ్బంది కవర్ల తొలగించి గ్రౌండ్ను ఆటకు సిద్దం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి వర్షం వస్తే మాత్రం బంతి పడకుండానే ఈ మ్యాచ్ రద్దవ్వనుంది.

ఈ మ్యాచ్ రద్దయితే సన్రైజర్స్ హైదరాబాద్కు కలిసి రానుంది. 17 పాయింట్లతో పాటు మెరుగైన రన్రేట్తో ఆ జట్టు టాప్-2లో నిలవనుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కంటే సన్రైజర్స్ రన్రేట్ మెరుగ్గా ఉంది. అదే జరిగితే సన్రైజర్స్ హైదరాబాద్కు క్వాలిఫయర్-1 ఆడే అవకాశం దక్కుతుంది. టేబుల్ టాపర్ అయిన కేకేఆర్తో క్వాలిఫయర్-1లో విజయం సాధిస్తే నేరుగా ఫైనల్ చేరుతోంది. ఓడితే.. క్వాలిఫయర్-2 ఆడాల్సి ఉంటుంది.
కేకేఆర్పై రాజస్థాన్ రాయల్స్ విజయం సాధిస్తే మాత్రం 18 పాయింట్లతో ఆ జట్టు రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. అప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్.. ఆర్సీబీతో ఎలిమినేటర్ ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్లో గెలిచి క్వాలిఫయర్-2లో విజయం సాధిస్తేనే ఫైనల్ చేరుతోంది. ఈ క్రమంలోనే కేకేఆర్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ రద్దవ్వాలని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు కోరుకుంటున్నారు.
పంజాబ్ కింగ్స్తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 214 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 215 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
అభిషేక్ శర్మ(28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 66), హెన్రీచ్ క్లాసెన్(26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 42 ) సత్తా చాటారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్ తలో వికెట్ పడగొట్టారు.