అసలేం జరిగిందంటే..?
కోల్కతా ఇన్నింగ్స్ సందర్భంగా ప్రసిద్ కృష్ణ వేసిన 19వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పదే పదే అంపైర్ వైడ్లు ఇవ్వడంతో సంజూ శాంసన్ సహనం కోల్పోయాడు. దాంతో వైడ్ బాల్కు డీఆర్ఎస్ కోరుతూ నిరసన వ్యక్తం చేశాడు. ఆపై అంపైర్ దగ్గరకు వచ్చి వాదించాడు. 19వ ఓవర్ మొదటి రెండు బంతులు ఆఫ్ సైడ్ స్టంప్ వేయగా సింగిల్స్ వచ్చాయి. క్రీజ్లో ఉన్న రింకూ సింగ్ ఆఫ్ వికెట్ అవతలికి వచ్చి ఆడేందుకు ప్రయత్నించగా.. ప్రసిద్ మూడో బంతిని వికెట్లకు దూరంగా విసిరాడు. అయితే, అంపైర్ దాన్ని వైడ్గా ప్రకటించాడు. ఆ తర్వాతి బంతి ఫోర్గా వెళ్లింది. నాలుగో బంతిని కూడా వికెట్లకు దూరంగా విసరగా దాన్ని కూడా అంపైర్ వైడ్గా ప్రకటించాడు.

మైదానంలో హైడ్రామా..?
ఆ తర్వాత కూడా అంపైర్ ఇదే విధానాన్ని కొనసాగించాడు. నితీష్ బ్యాటింగ్కు వచ్చిన తర్వాత కూడా వరుసగా రెండు వైడ్లను ఇవ్వడంతో ఫ్రస్టేషన్కు గురైన సంజూ.. నేరుగా అంపైర్ వద్దకు వెళ్లి ఇది సరైన నిర్ణయం కాదంటూ వాదించాడు. దాంతో మైదానంలో కాసేపు హైడ్రామా నడిచింది. మ్యాచ్లో మిగతా ఓవర్లలో ఆ లైన్ మీద పడిన బంతులు వైడ్లు కానప్పుడు ఈ ఓవర్లో ఎలా అవుతాయంటూ అంపైర్ను సంజూ నిలదీసాడు. ఈ సమయంలో బౌలర్ ప్రసిద్ కృష్ణ, అంపైర్ నితిన్ పండిట్కు కొంత వాగ్వాదం కూడా నడిచింది. చివరకు సంజూనే వెనక్కి తగ్గడంతో ప్రశాంతంగా ముగిసింది.

వైడ్ బాల్కు కూడా రివ్యూ..
ఈ సీజన్లో అంపైర్లు ఇప్పటి వరకు చాలా తప్పులు చేశారు. దాంతో వైడ్ బాల్కు రూడా రివ్యూ తీసుకునే వెసులుబాటు ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. క్రికెట్ కమిటీ దీనిపై సమగ్ర ఆలోచన చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరితో పాటు సౌతాఫ్రికా దిగ్గజ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్లు ఈ డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ఐసీసీ రూల్స్ 22.4.1 ప్రకారం వైడ్ బాల్స్ను గుర్తించడానికి స్పష్టమైన విధానం ఉందని, అంపైరింగ్ తప్పిదాలు మళ్లీ మళ్లీ చోటుచేసుకుంటూనే ఉంటున్నాయని వ్యాఖ్యానించారు. అందుకే- డీఆర్ఎస్ విధానాన్ని వైడ్ బాల్స్కు కూడా వర్తింపజేయడం వల్ల పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు.

రింకూ సింగ్ చెలరేగడంతో..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేసింది. సంజూ శాంసన్(49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. చివర్లో రియాన్ పరాగ్(12 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 19), హెట్మైర్(13 బంతుల్లో 2 సిక్స్లు, ఫోర్తో 27 నాటౌట్) మెరుపులు మెరిపించారు. కేకేఆర్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. శివం మావి, సునీల్ నరైన్, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసి మరో 5 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. నితీశ్ రాణా(37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 48 నాటౌట్), రింకూ సింగ్ (23 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 42 నాటౌట్) అజేయంగా నిలిచి విజయంలో కీలక పాత్ర పోషించారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిధ్, కుల్దీప్ సేన్ తలో వికెట్ తీసారు.


Click it and Unblock the Notifications












