ఐపీఎల్ 2024 సీజన్లో మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య గౌహతి వేదికగా ఆదివారం జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్ బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. వర్షం పదే పదే అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు.
దాంతో పాయింట్స్ టేబుల్లో 20 పాయింట్లతో కేకేఆర్ టాప్లో నిలవగా.. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ 17 పాయింట్స్తో 2, 3 స్థానాలను దక్కించుకున్నాయి. 14 పాయింట్లతో ఆర్సీబీ నాలుగో స్థానంలో నిలిచింది.

కేకేఆర్తో మ్యాచ్ రద్దవ్వడంతో రాజస్థాన్ రాయల్స్ మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. 17 పాయింట్లతో పాటు మెరుగైన రన్రేట్తో రెండో స్థానంలో నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్.. క్వాలిఫయర్-1 మ్యాచ్కు అర్హత సాధించింది. మంగళవారం(మే 21) అహ్మదాబాద్ వేదికగా జరిగే క్వాలిఫయర్-1లో టేబుల్ టాపర్ కేకేఆర్తో..రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది.
అహ్మదాబాద్ వేదికగానే బుధవారం(మే 22) జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2లో క్వాలిఫయర్-1లో ఓడిపోయే టీమ్తో తలపడనుంది.
క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో టైటిల్ కోసం పోరాడనుంది. వర్షం కాసేపు ఆగిపోవడంతో రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ మధ్య ఏడు ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు సిద్దమయ్యారు. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఆటగాళ్లంతా మైదానంలోకి అడుగుపెట్టే సమయానికి మరోసారి వర్షం రావడంతో ఆటను పూర్తిగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.