ఐపీఎల్ 2025 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) ఎట్టకేలకు బోణీ చేసింది. ఓటమితో ఈ సీజన్ ప్రారంభించిన కేకేఆర్.. రాజస్థాన్ రాయల్స్తో బుధవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. క్వింటన్ డికాక్(61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లతో 97 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్తో కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్(28 బంతుల్లో 5 ఫోర్లతో 33), యశస్వి జైస్వాల్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(2/17), మోయిన్ అలీ(2/23), హర్షిత్ రాణా(2/36), వైభవ్ అరోరా(2/33) రెండేసి వికెట్లు తీయగా.. స్పెన్సర్ జాన్సన్ ఓ వికెట్ పడగొట్టాడు.

డికాక్ విధ్వంసం..
అనంతరం కేకేఆర్ 17.3 ఓవర్లలో 2 వికెట్లకు 153 పరగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. క్వింటన్ డికాక్తో పాటు, అంగ్క్రిష్ రఘువంశీ(17 బంతుల్లో 2 ఫోర్లతో 22 నాటౌట్) రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో వానిందు హసరంగా ఒక్కడే వికెట్ తీసాడు. లక్ష్యచేధనలో కేకేఆర్కు ఆశించిన శుభారంభం దక్కలేదు. వికెట్ స్లోగా ఉండటంతో కేకేఆర్ ఓపెనర్లు ఆచితూచి ఆడారు. దాంతో పవర్ ప్లేలో కేకేఆర్ 40 పరుగులే చేసింది.
అనంతరం మోయిన్ అలీ(5) రనౌటవ్వగా.. రహానేతో కలిసి డికాక్ ఆచితూచి ఆడాడు. రహానేను హసరంగా ఔట్ చేయగా.. రఘు వంశీతో కలిసి డికాక్ చెలరేగాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసుకున్న అతను ఆ తర్వాత భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. భారీ సిక్సర్తో ఈ మ్యాచ్ను ముగించాడు.
మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
కేకేఆర్ స్పిన్నర్లు అయిన వరుణ్ చక్రవర్తీ, మోయిన్ అలీ అద్భుత ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించారు. స్పిన్కు అనుకూలంగా ఉన్న వికెట్పై వరుస విరామాల్లో వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ను కోలుకోలేని దెబ్బతీసారు. ఈ ఇద్దరూ 8 ఓవర్లలో 40 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టారు. దాంతో పవర్ ప్లేలో దూకుడుగా ఆడిన రాజస్థాన్ రాయల్స్.. స్వల్ప స్కోర్కే పరిమితమైంది. సంచలన బౌలింగ్తో రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, వానిందు హసరంగా, నితీష్ రాణాలను ఔట్ చేసి మ్యాచ్ను కేకేఆర్వైపు మలుపు తిప్పారు.