న్యూఢిల్లీ: కోల్కతా నైట్రైడర్స్ యువ స్పిన్నర్ సుయాశ్ శర్మపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో సుయాశ్ శర్మ ఉద్దేశ పూర్వకంగానే వైడ్ బాల్ వేసే ప్రయత్నం చేయడం విమర్శలకు దారి తీసింది.
ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్(47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 150 పరుగుల లక్ష్యాన్ని 41 బంతులు మిగిలి ఉండగానే అధిగమించింది. అయితే యశస్వీ జైస్వాల్ సెంచరీని అడ్డుకోవాలనే ఆలోచనతో సుయాశ్ శర్మ ఉద్దేశ పూర్వకంగా వైడ్ బాల్ వేసే ప్రయత్నం చేశాడు.

సుయాశ్ దురుద్దేశాన్ని ముందే పసిగట్టిన సంజూ శాంసన్.. బంతి వైడ్ వెళ్లకుండా తన కాలితో అడ్డుకొని జైస్వాల్కు బ్యాటింగ్కు ఇచ్చాడు. భారీ సిక్సర్తో సెంచరీ పూర్తి చేసుకోవాలని సూచించాడు. 13వ ఓవర్ చివరి బంతికి ఈ ఘటన చోటు చేసుకోగా.. 14వ ఓవర్లో జైస్వాల్ స్ట్రైకింగ్కు వచ్చాడు. అప్పటికీ రాజస్తాన్ విజయానికి 3 పరుగులే అవసరం కాగా.. జైస్వాల్ సెంచరీకి 6 పరుగులు కావాలి. సిక్సర్ ఒక్కటే అతని ముందున్న ఏకైక ఆప్షన్.
కానీ శార్దూల్ ఠాకూర్ వేసిన ఆ ఓవర్లో యశస్వీ బౌండరీనే కొట్టడంతో 2 పరుగుల దూరంలో సెంచరీని అందుకోలేకపోయాడు. ఉద్దేశపూర్వకంగా వైడ్ వేయాలనుకున్న సుయాశ్పై నెటిజన్లు మండిపడ్డారు. టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా సైతం ఘాటుగా విమర్శించాడు. ఇదే భారత్-పాక్ మ్యాచ్ అయ్యి.. యశస్వీ స్థానంలో కోహ్లీ 94 పరుగుల వద్ద ఉండి ఉంటే.. అప్పుడు పాక్ బౌలర్ సుయాశ్లా అడ్డుకునే ప్రయత్నం చేస్తే రచ్చ రచ్చ జరిగేదని ట్వీట్ చేశాడు.
సుయాశ్ చేసింది చాలా తప్పని అభిప్రాయపడ్డాడు. మరో ట్వీట్లో యశస్వీ బ్యాటింగ్ను కొనియాడాడు. యశస్వి త్వరలోనే భారత జట్టులోకి వస్తాడని జోస్యం చెప్పాడు. ఐపీఎల్ ప్రదర్శనలే కాకుండా.. దేశవాళీలో కూడా అతను పరుగులు సాధిస్తున్నాడని తెలిపాడు.