ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని గుజరాత్ టైటాన్స్ సారథి శుభ్మన్ గిల్ తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. వర్షం వచ్చే అవకాశం ఉండటంతోనే చేజింగ్ చేయాలనుకుంటున్నాం. ప్రధాన ఆటగాళ్లు గాయపడినప్పుడు టీమ్ కాంబినేషన్ సెట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. జట్టులో కొన్ని మార్పులు చేశాం. కేన్ విలియమ్సన్ స్థానంలో మాథ్యూ వేడ్ జట్టులోకి వచ్చాడు.

శరత్ స్థానంలో మనోహర్ను తీసుకున్నాం. గత రెండు మ్యాచ్ల్లో మేం తృటిలో విజయాన్ని చేజార్చుకున్నాం. క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమించలేకపోయాం. బ్యాటింగ్ విభాగం బాగానే రాణిస్తుంది. కెప్టెన్సీ నా బ్యాటింగ్పై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. కెప్టెన్గా ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం ఇవ్వడం ముఖ్యం.'అని గిల్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. కెప్టెన్గా నా ప్రయాణం ప్రత్యేకం. టీమ్ సహకారం లేనిదే ఏ కెప్టెన్ కూడా రాణించలేడు. సంగక్కర వంటి సపోర్ట్ స్టాఫ్ ఉండటం నా అదృష్టం. మేం వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచినా.. విభిన్నమైన సవాళ్లను ఎదుర్కొన్నాం. తుది జట్టుపై నాకు క్లారిటీ లేదు. షీట్లో చూడండి.'అని సంజూ శాంసన్ పేర్కొన్నాడు.
తుది జట్లు:
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మైర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్
గుజరాత్ టైటాన్స్: శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, మాథ్యూ వేడ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేశ్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ