గుజరాత్ టైటాన్స్ అద్భుత బ్యాటింగ్తోనే సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓటమిపాలయ్యామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ సంచలన బ్యాటింగ్తో గుజరాత్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు ఇదే తొలి పరాజయం కావడం విశేషం. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమికి గల కారణాన్ని వెల్లడించేందుకు సంజూ శాంసన్ నిరాకరించాడు.

ఆఖరి బంతికే ఓటమిపాలయ్యామని చెబుతూ నవ్వులు పూయించాడు. ఈ టోర్నీలోనే కెప్టెన్లంతా కఠినంగా భావించే సందర్భం ఏదైనా ఉందా? అంటే అది ఓటమికి గల కారణాలు చెప్పడమేనని అసహనం వ్యక్తం చేశాడు.
'చివరి బంతి కారణంగానే ఓటమిపాలయ్యాం(నవ్వుతూ). నిజాయితీగా చెప్పాలంటే ఇప్పుడు మాట్లాడటం నాకు చాలా కష్టంగా ఉంది. ఈ లీగ్లో కెప్టెన్లంతా కఠినంగా భావించే సందర్భం ఏదైనా ఉందా? అంటే అది ఓటమి తర్వాత అందుకు గల కారణాలు గురించి చెప్పడమే. అది చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని గంటల తర్వాత ఓటమికి గల కారణాలను చెప్పగలను.
అయితే ఈ గెలుపు క్రెడిట్ మాత్రం గుజరాత్ టైటాన్స్దే. వాళ్లు బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ అద్భుతంగా చేశారు. ఈ ఓటమి నుంచి మేం గుణపాఠం నేర్చుకొని ముందుకు సాగుతాం. నేను బ్యాటింగ్ చేసేటప్పుడు 180 పరుగులు కూడా పోరాడే లక్ష్యమని భావించాను.
వాస్తవానికి మేం చేసిన 197 రన్స్ గెలవాల్సిన లక్ష్యం. ఏ మాత్రం తేమ లేకుండా స్లోగా.. డ్రైగా ఉన్న ఈ పిచ్పై ఈ లక్ష్యాన్ని చేధించడం చాలా కష్టం. మా బౌలింగ్ యూనిట్ సామర్థ్యాల ప్రకారం ఈ లక్ష్యాన్ని మేం డిఫెండ్ చేసుకోవాల్సింది. కానీ గుజరాత్ టైటాన్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది.
మా ఇన్నింగ్స్ ఆరంభంలో ఈ వికెట్పై బ్యాటింగ్ చాలా కష్టంగా అనిపించింది. కానీ మేం అద్భుతంగా ఆడి 197 పరుగులు చేశాం. జైపూర్ వేదికగా 197 పరుగులను ఎప్పుడైనా కాపాడుకోవాల్సిన స్కోర్'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.