ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 186 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. స్లో వికెట్పై రియాన్ పరాగ్(45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లతో 84 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది.
రవిచంద్రన్ అశ్విన్(19 బంతుల్లో 3 సిక్స్లతో 29), ధ్రువ్ జురెల్(12 బంతుల్లో 3 ఫోర్లతో 20) మెరుపులు మెరిపించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముకేష్ కుమార్, అన్రిచ్ నోర్జ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. పిచ్ నుంచి లభించిన అడ్వాంటేజ్తో ఢిల్లీ బౌలర్లు చెలరేగగా.. రాజస్థాన్ రాయల్స్ 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ భారీ సిక్స్లతో జట్టుపై ఉన్న ఒత్తిడిని తగ్గించాడు. మరో ఎండ్లో రియాన్ పరాగ్ ఆచితూచి ఆడాడు.
ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు 54 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే క్రమంలో అశ్విన్(29) ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్ దూకుడగా బ్యాటింగ్ చేశాడు. రియాన్ పరాగ్ సైతం భారీ సిక్స్లతో 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అన్రిచ్ నోర్జ్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్ క్లీన్ బౌల్డ్ కాగా.. బ్యాటింగ్ వచ్చిన షిమ్రాన్ హిట్మైర్ మెరుపులు మెరిపించాడు.
అన్రిచ్ నోర్జ్ వేసిన చివరి ఓవర్లో రియాన్ పరాగ్.. వరుసగా 4, 4, 6, 4,6, 1తో 25 పరుగులు పిండుకున్నాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేసింది. ఓ దశలో రాజస్థాన్ రాయల్స్ 150 పరుగులు చేసినా గొప్పే అనిపించింది. కానీ రియాన్ పరాగ్ సూపర్ బ్యాటింగ్తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు.
డ్యూ రావడం కూడా బ్యాటర్ల పని సులువు చేసింది. బౌలింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై ఈ లక్ష్యాన్ని చేధించడం ఢిల్లీ క్యాపిటల్స్కు కష్టమే.