రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో రియాన్ పరాగ్ (45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లతో 84 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును విధ్వంసకర బ్యాటింగ్తో రియాన్ పరాగ్ ఆదుకున్నాడు. అన్రిచ్ నోకియా వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 4, 4, 6, 4,6, 1తో 25 పరుగులు చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఈ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు మరో మూడు అవార్డులను సొంతం చేసుకున్నాడు.

ఈ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన పట్ల రియాన్ పరాగ్ భావోద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన తల్లి ముందు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయడం గర్వంగా ఉందని చెప్పాడు.
'మా అమ్మ ఇక్కడ ఉంది. ఈ రోజు నా ఆటను ప్రత్యక్షంగా చూసింది. నా ప్రదర్శన పట్ల గర్వపడి ఉంటుంది. గత నాలుగేళ్లుగా నా కష్టాలను చూసిన ఆమెకు ఈ ప్రదర్శన సంతోషాన్నిచ్చిందనుకుంటా. ఈ తరహా ప్రదర్శన కోసం నేను తీవ్రంగా కష్టపడ్డాను. దేశవాళీ క్రికెట్లోనూ మెరుగైన ప్రదర్శన చేశాను.
అది నాకు చాలా ఉపయోగపడింది. వికెట్ నెమ్మదిగా ఉన్నప్పుడు టాప్-4లో ఎవరైనా 20 ఓవర్లు ఆడాలి. తొలి మ్యాచ్లో సంజూ భయ్యా ఈ పని చేశాడు. ఈ మ్యాచ్ కోసం నేను చాలా కష్టపడ్డాను. అనారోగ్యంతో గత మూడు రోజులు నేను బెడ్పైనే ఉన్నాను. పెయిన్ కిల్లర్స్ తీసుకొని ఈ రోజే లేచాను. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది.'అని రియాన్ పరాగ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లతో 84 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులే చేసి ఓటమిపాలైంది.
డేవిడ్ వార్నర్(34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 49), ట్రిస్టన్ స్టబ్స్(23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 44 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, బర్గర్ రెండు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.