ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మరో విజయాన్నందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్లో రియాన్ పరాగ్ సత్తా చాటగా.. బౌలింగ్లో ఆవేశ్ ఖాన్ ఆఖరి ఓవర్ను అద్భుతంగా కట్టడి చేసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్(45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లతో 84 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. రవిచంద్రన్ అశ్విన్(19 బంతుల్లో 3 సిక్స్లతో 29), ధ్రువ్ జురెల్(12 బంతుల్లో 3 ఫోర్లతో 20) మెరుపులు మెరిపించారు.

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముకేష్ కుమార్, అన్రిచ్ నోర్జ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
కొంపముంచిన అన్రిచ్ నోర్జ్..
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 173 పరుగులే చేసి ఓటమిపాలైంది. డేవిడ్ వార్నర్(34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 49), ట్రిస్టన్ స్టబ్స్(23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 44 నాటౌట్) రాణించినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, బర్గర్ రెండు వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్లో అన్రిచ్ నోర్జ్... రియాన్ పరాగ్ ధాటికి ఆఖరి ఓవర్లో 25 పరుగులు ఇవ్వడం ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిని శాసించింది.
దూకుడుగా ఆడినా..
భారీ లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఇన్నింగ్స్ను దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్లు మిచెల్ మిర్ష్(23), డేవిడ్ వార్నర్ వరుస బౌండరీలు బాదారు. అయితే నండ్రే బర్గర్ ఒకే ఓవర్లో మిచెల్ మార్ష్(23), రికీ భుయ్లను పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్తో వార్నర్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు.
ఆవేశ్ ఖాన్ సూపరో సూపర్..
హాఫ్ సెంచరీకి చేరువైన వార్నర్ను ఆవేశ్ ఖాన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే రిషభ్ పంత్(28)ను చాహల్ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన అభిషేక్ పోరెల్(9) కూడా నిరాశపరిచాడు. ఈ పరిస్థితుల్లో అక్షర్ పటేల్తో కలిసి ట్రిస్టన్ స్టబ్స్ చెలరేగాడు. భారీ షాట్లతో ధాటిగా ఆడుతూ ఢిల్లీ శిభిరంలో ఆశలు రేకెత్తించాడు. ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయానికి 17 పరుగులు అవసరమవ్వగా.. ఆవేశ్ ఖాన్ 4 పరుగులే ఇచ్చాడు.