గువహతి: ఐపీఎల్ 2023 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మరో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన రాజస్థాన్ 57 పరుగుల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్(55 బంతుల్లో 7 ఫోర్లతో 65) జిడ్డు బ్యాటింగ్ ఆ జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది.
అతను టాప్ స్కోరర్గా నిలిచినా..లాభం లేకపోయింది. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓటముల్లో హ్యాట్రిక్ కొట్టింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది.

యశస్వి జైస్వాల్(31 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 60), జోస్ బట్లర్(51 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 79) హాఫ్ సెంచరీలతో రాణించగా.. షిమ్రాన్ హెట్మైర్(21 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 39 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, రోవ్మన్ పొవెల్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులే చేసి ఓటమిపాలైంది. డేవిడ్ వార్నర్, లలిత్ యాదవ్(24 బంతుల్లో 5 ఫోర్లతో 38) మినహా అంతా విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, చాహల్ మూడేసి వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టాడు. సందీప్ శర్మకు ఓ వికెట్ దక్కింది.
భారీ లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్కు ట్రెంట్ బౌల్ట్ ఊహించని షాకిచ్చాడు. వరుస బంతుల్లో పృథ్వీ షా(0), మనీశ్ పాండే(0)లను డకౌట్గా పెవిలియన్ చేర్చాడు. రిలీ రోసౌ(14) అశ్విన్ ఔట్ చేయడంతో పవర్ ప్లేలో ఢిల్లీ 3 వికెట్లకు 38 పరుగులే చేసింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన లలిత్ యాదవ్తో వార్నర్ ఆచితూచి ఆడాడు.
లలిత్ యాదవ్ కాస్త ధాటిగా ఆడినా.. వార్నర్ సింగిల్స్, డబుల్స్కే పరిమితమయ్యాడు. దాంతో ఒత్తిడికి గురైన లలిత్ యాదవ్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో బౌల్ట్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగో వికెట్కు నమోదైన 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత వచ్చిన అక్షర్ పటేల్(2), రోవ్మన్ పొవెల్(2), అభిషేక్ పోరెల్(7) కూడా విఫలమవడం.. డేవిడ్ వార్నర్ కూడా ఎల్బీగా వెనుదిరగడంతో రాజస్థాన్ రాయల్స్ విజయం లాంఛనమైంది. అన్రిచ్ నోర్జ్(0) ఔటైనా.. కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్ ఆలౌటవ్వకుండా జాగ్రత్తగా ఆడి మ్యాచ్ను ముగించారు.