గువహటి: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాపై క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2023 సీజన్లో వరుసగా మూడో మ్యాచ్లోనూ పృథ్వీ షా(0) దారుణంగా విఫలమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన అతను
సంజూ శాంసన్ కళ్లు చెదిరే క్యాచ్కు వెనుదిరిగాడు.
ట్రెంట్ బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే ఔటయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ స్వింగ్ ఆడలేకపోయిన పృథ్వీ షా.. కీపర్కు చిక్కి నిరాశగా పెవిలియన్ చేరాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఈ ఓవర్ మూడో బంతిని పృథ్వీ షా కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేయగా.. బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి ఫస్ట్ స్లిప్ దిశగా దూసుకెళ్లింది.

వికెట్ కీపర్ సంజూ శాంసన్ సూపర్ డైవ్తో బంతిని ఒడిసిపట్టుకున్నాడు. దాంతో పృథ్వీ షా నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. పృథ్వీ షాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పృథ్వీ షా చేజేతులా కెరీర్ను నాశనం చేసుకుంటున్నాడని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా ఇచ్చిన చివరి అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాడని, తదుపరి మ్యాచ్లో అతనికి అవకాశం దక్కదని జోస్యం చెబుతున్నారు. పృథ్వీ షా కెరీర్ రంజీలకే పరిమితం అవుతుందని, అతను మళ్లీ టీమిండియాలోకి రావడం చాలా కష్టమని అభిప్రాయపడుతున్నారు.
ఓపెనర్లు యశస్వి జైస్వాల్(31 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 60), జోస్ బట్లర్(51 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 79) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, రోవ్మన్ పొవెల్ తలో వికెట్ తీసారు. లక్ష్యచేధనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.