ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 100 మ్యాచ్లు మైలురాయి అందుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్తో రిషభ్ పంత్ ఈ ఫీట్ సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఈ ఘనతను అందుకున్న తొలి ప్లేయర్గా నిలిచాడు.
రిషభ్ పంత్ మినహా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున మరే ప్లేయర్ కూడా 100 మ్యాచ్ల మైలురాయి అందుకోలేదు. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రిషభ్ పంత్.. అప్పటి నుంచి ఈ జట్టుకే ఆడుతున్నాడు. ఘోర రోడ్డు ప్రమాదంతో గత సీజన్కు దూరమైన అతను.. ఏడాదిన్నర తర్వాత ఈ సీజన్తోనే మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు.

పంజాబ్ కింగ్స్తో జరిగిన గత మ్యాచ్లో 18 పరుగులే చేసి నిరాశపర్చినా.. కీపింగ్లో మాత్రం సత్తా చాటాడు. అరంగేట్ర సీజన్లో రూ. 1.90 కోట్ల ధర పలికిన పంత్.. ఇప్పుడు కెప్టెన్గా రూ. 16 కోట్లు తీసుకుంటున్నాడు. ఇప్పటి వరకు 99 మ్యాచ్ల్లో 34.41 సగటుతో 2856 పరుగులు చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రిషభ్ పంత్ తర్వాత అమిత్ మిశ్రా 99, శ్రేయస్ అయ్యర్ 87, డేవిడ్ వార్నర్ 82, వీరేంద్ర సెహ్వాగ్ 79 మ్యాచ్లు ఆడారు.ఓవరాల్గా ఐపీఎల్లో ఓ జట్టు తరఫున 100 మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఏడో ప్లేయర్గా రిషభ్ పంత్ నిలిచాడు.
అందరి కన్నా ముందు సీఎస్కే తరఫున సురేశ్ రైనా 100 మ్యాచ్ల మైలురాయి అందుకున్నాడు. అతని తర్వాత హర్భజన్ సింగ్(ముంబై ఇండియన్స్), విరాట్ కోహ్లీ(ఆర్సీబీ), గౌతమ్ గంభీర్(కేకేఆర్), రాజస్థాన్ రాయల్స్(అజింక్యా రహానే), సన్రైజర్స్(భువనేశ్వర్ కుమార్), రిషభ్ పంత్(ఢిల్లీ)లు ఈ ఫీట్ సాధించారు.
మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రిషభ్ పంత్ తెలిపాడు.