గువహతి: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్(31 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 60), జోస్ బట్లర్(51 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్తో 79) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్లు అద్భుత ప్రదర్శన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది.
యశస్వి, బట్లర్కు అండగా షిమ్రాన్ హెట్మైర్(21 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 39 నాటౌట్) ధాటిగా ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ముఖేశ్ కుమార్ రెండు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, రోవ్మన్ పొవెల్ తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లోనే యశస్వి ఐదు బౌండరీలతో 20 పరుగులు పిండుకున్నాడు. జోస్ బట్లర్ సైతం వరుస బౌండరీలతో విరుచుకుపడటంతో పవర్ ప్లేలోనే రాజస్థాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది.
అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ఈ క్రమంలో యశస్వి 11 ఫోర్ల సాయంతో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఓ భారీ సిక్సర్ బాదిన అతను.. అదే జోరులో ముఖేశ్ కుమార్కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్(0)ను కుల్దీప్ యాదవ్ డకౌట్ చేయగా.. పోవెల్ దెబ్బకు రియాన్ పరాగ్(7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో రాజస్థాన్ జోరుకు కాస్త బ్రేక్ పడింది. డేంజరస్ షిమ్రాన్ హెట్మైర్ క్రీజులోకి రాగా.. జోస్ బట్లర్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హెట్మైర్తో కలిసి ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
49 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ముఖేశ్ కుమార్ విడదీసాడు. జోస్ బట్లర్ను రిటర్న్ క్యాచ్తో పెవిలియన్ చేర్చాడు. ధృవ్ జురెల్ సాయంతో హెట్మైర్ ధాటిగా ఆడి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.