
అబుదాబి: రుతురాజ్ గైక్వాడ్(60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 101 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్ ముందు చెన్నై సూపర్ కింగ్స్ 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. గైక్వాడ్ సూపర్ సెంచరీతో రాణించగా.. రవీంద్ర జడేజా(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తెవాటియా మూడు వికెట్లు తీయగా.. సకారియా ఓ వికెట్ పడగొట్టాడు. ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్కు 100 మీటర్ల సిక్స్ బాదిన రుతురాజ్.. కెరీర్లో ఫస్ట్ ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు. ఈ సీజన్లో ఇది నాలుగో సెంచరీ కావడం గమనార్హం. రుతురాజ్ కన్నా ముందు సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్, జోస్ బట్లర్ శతకాలు బాదారు.
ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్(19 బంతుల్లో 25) మంచి శుభారంభాన్ని అందించారు. ఈ ఇద్దరు ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో చెన్నై వికెట్ నష్టపోకుండా 44 రన్స్ చేసింది. అయితే ఆ వెంటనే రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్.. రాహుల్ తెవాటియాను బౌలింగ్కు దించి ఫలితం రాబట్టాడు. క్రీజులో కుదురుకున్న చెన్నై ఓపెనింగ్ జోడిని విడదీశాడు. తెవాటియా బౌలింగ్లో డుప్లెసిస్ స్టంపౌటయ్యాడు.
దాంతో ఫస్ట్ వికెట్కు నమోదైన 47 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా(3)ను తన మరుసటి ఓవర్లో తెవాటియా పెవిలియన్ చేర్చాడు. అనంతరం మొయిన్ అలీ(21) క్రీజులోకి రాగా.. రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరు వీలు చిక్కిన బంతికి బౌండరీకి తరలించారు. క్రీజులో కుదురుకున్న ఈ జోడీని మరోసారి తెవాటియే విడదీసాడు. మోయిన్ అలీని స్టంపౌట్గా పెవిలియన్ చేర్చాడు.
దాంతో రెండో వికెట్కు నమోదైన 54 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాయుడు(2).. సకారియా బౌలింగ్లో ధాటిగా ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. ఇక క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా మరోసారి తన విశ్వరూపాన్ని చూపించాడు. తనదైన బ్యాటింగ్తో ఆర్ఆర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరోవైపు సెంచరీకి చేరువైన రుతురాజ్ గైక్వాడ్.. ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాది శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.