ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో సందీప్ శర్మ అద్భుత బౌలింగ్తో రాజస్థాన్ రాయల్స్ ఓటమి నుంచి గట్టెక్కి తొలి విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. నితీష్ రాణా(36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 81) హాఫ్ సెంచరీతో రాణించగా.. రియాన్ పరాగ్(28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 37) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సీఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్(2/38), నూర్ అహ్మద్(2/28), మతీష పతీరణ(2/28) రెండేసి వికెట్లు తీయగా.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులే చేసి ఓటమి పాలైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(44 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 63) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. రవీంద్ర జడేజా(23 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ బౌలర్లలో వానిందు హసరంగా (4/35) నాలుగు వికెట్లు తీయగా.. జోఫ్రా ఆర్చర్(1/13), సందీప్ శర్మ(1/42) ఒక వికెట్ పడగొట్టాడు.
మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
చివరి 2 ఓవర్లలో సీఎస్కే విజయానికి 39 పరుగులు అవసరమవ్వగా.. తుషార్ దేశ్పాండే వేసిన 19వ ఓవర్లో ధోనీ ఓ బౌండరీతో పాటు భారీ సిక్సర్ బాదగా..ఆఖరి బంతిని జడేజా సిక్సర్ కొట్టి మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చాడు. దాంతో ఆఖరి ఓవర్లో సీఎస్కే విజయానికి 20 పరుగులు అవసరమయ్యాయి. సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి ధోనీ(16) క్యాచ్ ఔటవ్వగా.. జేమీ ఓవర్టన్(11 నాటౌట్) భారీ సిక్సర్ బాది ఉత్కంఠ పెంచాడు.
కానీ సందీప్ శర్మ చివరి రెండు బంతులను కట్టడిగా బౌలింగ్ చేసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. జోఫ్రా ఆర్చర్ను కాదని సందీప్ శర్మతో ఆఖరి ఓవర్ వేయించడం రాజస్థాన్ రాయల్స్కు కలిసొచ్చింది. తొలి బంతికే ధోనీ ఔటవ్వడం మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది.
మలుపు తిప్పిన క్యాచ్..
రాజస్థాన్ రాయల్స్ స్పెషలిస్ట్ స్పిన్నర్ వానిందు హసరంగా(4/35).. చెన్నై సూపర్ కింగ్స్ పతనాన్ని శాసించాడు. క్రీజులో సెట్ అయిన రాహుల్ త్రిపాఠి(23), రుతురాజ్ గైక్వాడ్(63), శివమ్ దూబే(18), విజయ్ శంకర్(9)లను పెవిలియన్ చేర్చాడు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్టన్నింగ్ క్యాచ్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. హసరంగా బౌలింగ్లో శివమ్ దూబే ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను త్రిపాఠి అద్భుతంగా అందుకున్నాడు.