
అబుదాబి: ఐపీఎల్ 2021 సెకండాఫ్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్నందుకుంది. పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్తో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ ఆశలను రాజస్థాన్ రాయల్స్ సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతం టేబుల్లో రాజస్థాన్ ఆరో ప్లేస్లో ఉంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 50) మెరుపు హాఫ్ సెంచరీకి.. శివమ్ ధూబే(42 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్ తోడవడంతో రాజస్థాన్ రాయల్స్ సునాయస విజయాన్నందుకుంది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్లతో 101 నాటౌట్) సూపర్ సెంచరీతో రాణించగా.. రవీంద్ర జడేజా(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 32 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తెవాటియా మూడు వికెట్లు తీయగా.. సకారియా ఓ వికెట్ పడగొట్టాడు. ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్కు 100 మీటర్ల సిక్స్ బాదిన రుతురాజ్.. కెరీర్లో ఫస్ట్ ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు.
అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 190 పరుగులు చేసి 15 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. శివమ్ ధూబే, జైస్వాల్ హాఫ్ సెంచరీలతో రాణించగా.. సంజూ శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీయగా.. ఆసీఫ్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఇక 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ను ధాటిగా మొదలుపెట్టింది. యువ ఓపెనర్ యశ్వసి జైస్వాల్, ఎవిన్ లూయిస్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27) ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. బాదడమే లక్ష్యంగా ఈ జోడీ చెలరేగింది. వీరి విధ్వంసానికి అబుదాబి మైదానంలో సిక్సర్ల వర్షం కురిసింది. భీకరంగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని శార్దూల్ ఠాకూర్ విడదీసాడు. ఎవిన్ లూయిస్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 77 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక అదే ఓవర్ ఆఖరి బంతికి బౌండరీ బాదిన యశస్వీ జైస్వాల్.. కెరీర్లో ఫస్ట్ ఐపీఎల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19 బంతుల్లో ఈ ఘనతను అందుకొని వేగవంతమై హాఫ్ సెంచరీల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. దాంతో పవర్ ప్లేలో రాజస్థాన్ వికెట్ నష్టానికి 81 రన్స్ చేసింది.
పవర్ ప్లే అనంతరం ఆసిఫ్ను రంగంలోకి దింపిన ధోనీ అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు. జోరు మీదున్న యశస్వి జైస్వాల్ను తెలివైన బౌన్సర్తో ఔట్ చేశాడు. అనంతరం క్రీజులోకి శివమ్ దూమే రాగా.. శాంసన్ ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగాడు. అతనికి దూబే కూడా తోడవ్వడంతో స్కోర్ బోర్డు పరుగెత్తింది. ఓవైపు దూబే దంచి కొడుతుండటంతో మరోవైపు శాంసన్ నిదానంగా ఆడుతూ స్ట్రైక్రొటేట్ చేశాడు. మొయిన్ అలీ వేసిన 10వ ఓవర్లో దూబే వరుస బంతుల్లో రెండు సిక్స్లు బాది.. తన జోరును చూపెట్టాడు. ఈ క్రమంలోనే 31 బంతుల్లో 2 ఫోర్లు, నాలుగు సిక్స్లతో దూబే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ కొద్దిసేపటికే సామ్సన్(28)ను శార్దూల్ ఔట్ చేసినా ఫలితం లేకపోయింది. క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్(13) సాయంతో శివమ్ దూబే మ్యాచ్ను ముగించాడు.