
ముంబై: ఓటమి బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్, ఇంగ్లండ్ ప్లేయర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ 2021 సీజన్కు దూరమయ్యాడు. సోమవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన హోరాహోరీ మ్యాచ్లో రాజస్థాన్ 4 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ బెన్ స్టోక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. రియాన్ పరాగ్ బౌలింగ్లో క్రిస్ గేల్ ఆడిన భారీ షాట్ను బెన్ స్టోక్స్ లాంగాన్లో అద్భుతంగా అందుకున్నాడు.
అయితే ఈ క్యాచ్ కోసం పరుగెత్తుకొచ్చిన స్టోక్స్.. డైవ్ చేసి మరి బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఈ క్రమంలో అతని ఎడమ చేతి వేలికి గాయమైంది. దాంతో కొంత అసౌకర్యంగా కనిపించిన స్టోక్స్.. అలానే తన ఆటను కొనసాగించాడు. బౌలింగ్ మాత్రం చేయలేదు. కానీ బ్యాటింగ్కు దిగాడు. మూడు బంతులు మాత్రమే ఎదుర్కొని డకౌట్గా వెనుదిరిగాడు. ఇక స్టోక్స్ గాయంపై రాజస్థాన్ రాయల్స్ అధికారిక ప్రకటన చేసింది.
'పంజాబ్తో మ్యాచ్లో ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఎడమ వేలికి గాయమైంది. వైద్య పరీక్షల్లో అతడి వేలు విరిగినట్లు తెలిసింది. దీంతో ఈ సీజన్ మొత్తానికి బెన్ దూరమయ్యాడు. మ్యాచ్లు ఆడకపోయినా ఇక్కడే ఉండి మైదానం బయట నుంచి బెన్ సలహాలు ఇవ్వబోతున్నాడు'' అని రాయల్స్ తెలిపింది. గాయం తీవ్రత తెలుసుకునేందుకు గురువారం స్టోక్స్కు ఎక్స్రే తీయనున్నారు. ఇక స్టోక్స్ గైర్హాజరీ రాజస్థాన్ రాయల్స్కు కోలుకోలేని దెబ్బ. ఇప్పటికే ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సేవలను కోల్పోయింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 రన్స్ చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(50 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 91), దీపక్ హుడా పరుగుల సునామీ సృష్టించారు. వీరికి అండగా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 40)రాణించాడు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ సకారియా మూడు వికెట్లు తీయగా.. క్రిస్ మోరిస్కు రెండు, రియాన్ పరాగ్ ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులకే పరిమితమైంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్లతో 119) సెంచరీతో ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ రెండు, రిలే మెరిడిత్, జై రిచర్డ్సన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.