సహచర ఓపెనర్ యశస్వి జైస్వాల్ సహకారంతోనే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశానని రాజస్థాన్ రాయల్స్ సిక్సర పిడుగు వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. ప్రతీ బంతి తర్వాత జైస్వాల్ తనతో మాట్లాడుతాడని, ఎక్కడ తగ్గాలి.. ఎప్పుడు చెలరేగాలనే విషయాలను చెబుతూ ప్రోత్సహిస్తాడని వెల్లడించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సోమవారం ఏపక్షంగా సాగిన తమ తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తు చేసింది.
బ్యాటింగ్కు ప్రతికూలంగా ఉన్న వికెట్పై వైభవ్ సూర్యవంశీ(17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది మ్యాచ్ను లాగేసుకున్నాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. తన ఇన్నింగ్స్ క్రెడిట్ యశస్వి జైస్వాల్కు ఇచ్చాడు. తన పుట్టిన రోజు ముఖానికి కేక్ పుస్తారేమోననే భయంతో త్వరగా పడుకున్నానని చెప్పి నవ్వులు పూయించాడు.

'నా 15వ బర్త్డేకు నేను కేక్ కూడా కట్ చేయలేదు. ముఖానికి కేక్ పూస్తారేమోననే భయంతో త్వరగా నిద్రపోయాను . ఈరోజు మా ప్లాన్ కేవలం పవర్ప్లేలో దూకుడుగా ఆడటం మాత్రమే. ఆరంభంలో వికెట్ కొంచెం నెమ్మదిగా అనిపించింది. కానీ బంతి పాతబడే కొద్దీ బ్యాట్పైకి ముద్దుగా వచ్చింది.
నేను డిఫెన్స్ కూడా ఆడగలను. కానీ ఈరోజు మా ప్లాన్ పవర్ప్లేలోనే గేమ్ను లాగేసుకోవడం. ఎందుకంటే చిన్న లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు పవర్ ప్లేలో రాణించడం కీలకం. ఒకవేళ బౌలింగ్ టీమ్ పవర్ ప్లేలో బాగా రాణిస్తే గేమ్ వారి వైపు తిరుగవచ్చు. కానీ మా పవర్ప్లే చాలా బాగా సాగింది. బౌలర్లు నన్ను టార్గెట్ చేస్తారని కోచ్లు ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు.

బౌలర్లు నన్ను టార్గెట్ చేస్తారని బయటి వారు చెబుతున్నదే. కోచ్లు మాత్రం నాకు అండగా ఉంటామని, నా సహజ సిద్దమైన ఆటను ఆడుతూ పరిస్థితికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేయాలని చెప్పారు. నా సహచర ఓపెనర్ జైస్వాల్.. ప్రతి బంతి తర్వాత నాతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడు సింగిల్స్ తీయాలో చెబుతుంటాడు. నాకు స్ట్రైకింగ్ ఇస్తూ.. బంతి బ్యాట్పైకి వస్తుందని షాట్స్ ఆడమని ప్రోత్సహిస్తాడు.'అని వైభవ్ సూర్యవంశీ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 19.4 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. జెమీ ఓవర్టన్(36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 43) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/19), నండ్రే బర్గర్(2/19), రవీంద్ర జడేజా(2/18) రెండేసి వికెట్లు తీయగా.. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ 12.1 ఓవర్లలోనే 2 వికెట్లకు 128 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. వైభవ్ సూర్యవంశీ(17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 52) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. యశస్వి జైస్వాల్(36 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 38 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో అన్షుల్ కంబోజ్ ఒక్కడే 2 వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.
