ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కీలక పోరుకు సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి టైటిల్ రేసులో నిలవాలనే పట్టుదలతో ఉంది. వర్షం కారణంగా టాప్-2లో నిలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్న రాజస్థాన్ రాయల్స్.. ఆర్సీబీని ఓడించి క్వాలిఫయర్-2 మ్యాచ్కు అర్హత సాధించాలని భావిస్తోంది.
టోర్నీ ఆరంభంలో అసాధారణ ప్రదర్శన కనబర్చిన రాజస్థాన్ రాయల్స్.. చివరి ఐదు మ్యాచ్ల్లో మాత్రం వరుసగా నాలుగింటిలో ఓడిపోయింది. కేకేఆర్తో జరగాల్సిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. మరోవైపు ఆర్సీబీ సంచలన విజయాలతో ప్లే ఆఫ్స్కు దూసుకొచ్చింది. వరుసగా 6 మ్యాచ్ల్లో గెలుపొందడమే కాకుండా పటిష్ట చెన్నైని మట్టికరిపించింది.

ప్రస్తుతం ఆర్సీబీ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఆ జట్టును ఓడించాలంటే రాజస్థాన్ రాయల్స్ అసాధారణ ప్రదర్శన కనబర్చాల్సిందే. పాకిస్థాన్తో సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ దూరమవ్వడం కూడా రాజస్థాన్ రాయల్స్కు బలహీనతగా మారింది. అయితే స్పిన్కు అనుకూలంగా ఉంటే అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుండటం రాజస్థాన్కు కలిసొచ్చే అంశం.
తుది జట్టులో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. జోస్ బట్లర్ స్థానంలో ఇంగ్లండ్కే చెందిన టామ్ కోహ్లేర్ బరిలోకి దిగనున్నాడు. అతనితో పాటు ట్రేంట్ బౌల్ట్, షిమ్రాన్ హెట్మైర్, రోవ్మన్ పోవెల్ విదేశీ ఆటగాళ్లుగా ఆడనున్నారు. జోస్ బట్లర్ దూరమైనా.. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ సూపర్ ఫామ్లో ఉన్నారు.
కీలక మ్యాచ్లో వీరు సత్తా చాటితే రాజస్థాన్ రాయల్స్కు తిరుగుండదు. బౌలింగ్లో అశ్విన్, చాహల్, బౌల్ట్ నిప్పులు చెరుగుతున్నారు. ఈ సీజన్లో ఆర్సీబీతో ఒకే ఒక మ్యాచ్ ఆడిన రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో సునాయస విజయాన్నందుకుంది.
రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు(అంచనా):
యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లేర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్మన్ పోవెల్, షిమ్రాన్ హెట్మైర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, ఆవేశ్ ఖాన్