
టాపార్డర్ వైఫల్యంతోనే..
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన స్మిత్.. బ్యాటింగ్ వైఫల్యంతోనే గత రెండు మ్యాచ్ల్లో మూల్యం చెల్లించుకున్నామని తెలిపాడు. ‘మేం మెరుగ్గా ఆడాల్సింది. బోర్డుపై పోరాడే లక్ష్యాన్ని ఉంచలేకపోయాం. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్పై భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మా లెగ్ స్పిన్నర్లు కూడా ఆకట్టుకున్నారు. కానీ బోర్డుపై స్కోర్ లేకపోవడంతో ఏం చేయలేకపోయాం. మా టాప్-3 బ్యాట్స్మెన్ బాధ్యాతాయుతంగా ఆడాలి. బ్యాటింగ్ వైఫల్యంతోనే గత రెండు మ్యాచ్ల్లో మూల్యం చెల్లించుకున్నాం. మేం చాలా డీప్గా బ్యాటింగ్ చేస్తున్నాం. కానీ మా టాపార్డర్ లాంగ్ ఇన్నింగ్స్లు ఆడాలి.

మహిపాల్ చక్కగా ఆడాడు..
యువ ఆటగాడు మహిపాల్ లోమ్రోర్ తీవ్ర ఒత్తిడిలో అద్భుతంగా ఆడాడు. ఒత్తిడిని అధిగమిస్తూ రాణించడంతో 155 పరుగులు చేయగలిగాం. అతని బ్యాటింగ్ చాలా మెచ్యూర్గా ఉంది. మేం కొన్ని విషయాల్లో మెరుగవ్వాలి. వాటిపై దృష్టిసారిస్తాం. మా లోపాలను అధిగమించుకొని తదుపరి మ్యాచ్కు సిద్దమవుతాం. ఇక్కడ చాలా వేడిగా ఉంది. డబుల్ తీసిన తర్వాత గాలిని పీల్చుకోలేకపోతున్నాం.'అని స్మిత్ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో స్మిత్(5) దారుణంగా విఫలమయ్యాడు.

దెబ్బతీసిన చాహల్
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్ చేసింది. కొత్తగా జట్టులోకి వచ్చిన కుర్రాడు మహిపాల్ లోమ్రోర్(39 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లతో 47)రాణించగా.. చివర్లో ఆర్చర్(16 నాటౌట్), రాహుల్ తెవాటియా(24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆర్సీబీ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్(3/24) మూడు వికెట్లతో చెలరేగగా.. ఇసురు ఉడానా(2/41) రెండు వికెట్లు తీసాడు. సైనీకి ఒక వికెట్ దక్కింది.

కోహ్లీ, పడిక్కల్ హాఫ్ సెంచరీ..
అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 19.1 ఓవర్లలోనే 2 వికెట్లకు 158 పరుగులు చేసి 5 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 72 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఓపెనర్ దేవ్దూత్ పడిక్కల్(45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో 63) తన ఫామ్ను కొనసాగించాడు. ఈ సీజన్లో పడిక్కల్కు ఇది మూడో హాఫ్ సెంచరీ. ఇక రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్ చెరొక వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications
