
ముంబై: సెంచరీ పూర్తి చేసుకోమని డేవిడ్ వార్నర్కు సూచిస్తే వద్దని చెప్పాడని ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ రోవ్మన్ పోవెల్ అన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో డేవిడ్ వార్నర్ (58 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్లతో 92 నాటౌట్), రోవ్మన్ పొవెల్(35 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 67 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. అయితే చివరి ఓవర్లో వార్నర్కు సెంచరీ చేసే అవకాశం ఉన్నా అతను జట్టు మేలునే కోరుకున్నాడు.
ఆఖరి ఓవర్లో స్ట్రైకింగ్లో ఉన్న రోవ్మన్ పోవెల్.. వార్నర్ సెంచరీ కోసం సింగిల్ తీద్దామనుకున్నా అతను వద్దని వారించాడట. ఈ విషయాన్ని ఇన్నింగ్స్ అనంతరం రోవ్మన్ పోవెల్ తెలిపాడు. 'చివరి ఓవర్కు ముందు సెంచరీ చేసుకునేందుకు వీలుగా సింగిల్ తీసి స్ట్రైకింగ్ ఇవ్వాలా? అని వార్నర్ను అడిగాను. దానికి అతను క్లాస్ పీకాడు. మనం అలాంటి క్రికెట్ ఆడవద్దని చెప్పాడు. నీ సాయిశక్తులా బంతిని హిట్ చేసేందుకు ప్రయత్నించమని చెప్పాడు.
నేను నా శక్తీమేరకు ఆడాను. పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. ముద్దుగా బంతి బ్యాట్పైకి దూసుకొచ్చింది. కొన్ని రోజుల క్రితమే పంత్తో నా బ్యాటింగ్ గురించి చర్చించాను. అతను ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తావని ప్రశ్నించాడు. దానికి నేను నాపై నమ్మకం ఉంచమని చెప్పాను. స్పిన్నర్లు, పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా నా బ్యాటింగ్ను మెరుపరుచుకున్నానని చెప్పాను. కనీసం 10-15 బంతులు ఆడే అవకాశమివ్వమని కోరాను. 207 పరుగులు మంచి లక్ష్యం. మా బౌలర్లు ఈ లక్ష్యాన్ని కాపాడగలరనుకుంటున్నా'అని పోవెల్ చెప్పుకొచ్చాడు.
డేవిడ్ వార్నర్, రోవ్మన్ పొవెల్ పరుగుల విధ్వంసంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఈ ఇద్దరి విధ్వంసం ముందు హైదరాబాద్ బౌలర్లు తేలిపోయారు. పోటాపడి మరీ పరుగులిచ్చుకున్నారు. భువీ, సీన్ అబాట్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్రైజర్స్ ఆదిలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ(7), కేన్ విలియమ్సన్(4), రాహుల్ త్రిపాఠి(22), ఎయిడెన్ మార్క్రమ్(42) వికెట్లు కోల్పోయింది.