
మిడిలార్డర్ వైఫల్యంతో...
'మేం ఏ మాత్రం ఊహించని ఫలితాన్ని సాధించాం. బ్యాటింగ్లో ఫస్టాఫ్ మూమెంట్ను కొనసాగించలేకపోయాం. దాంతో 10-15 పరుగులు తక్కువ చేశాం. ముఖ్యంగా బ్యాటింగ్ సెకండాఫ్ మాకు ఏం కలిసి రాలేదు. మిడిలార్డర్ బ్యాటర్లు పేలవ షాట్లతో ఔటయ్యారు. ఎలాంటి షాట్లు ఆడాలనే విషయాన్ని వారు తెలుసుకోవాల్సి ఉంది. అయితే ఆటలో ఇవన్నీ సహజమే. ఓటములు టీమ్ బలహీనతలు, మెరుగవ్వాల్సిన విషయాలను తెలియజేస్తాయి. బౌలింగ్లో అద్భుతంగా పోరాడాం. తొలి వికెట్కు మంచి భాగస్వామ్యం లభించినా ఆఖరి బంతి వరకు మ్యాచ్ను తీసుకెళ్లాం. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు సత్తా చాటి కీలక వికెట్లు తీసారు. కానీ శ్రీలంక అసాధారణ ఆటతో మ్యాచ్ను గెలుచుకుంది.

మా ప్లాన్ వర్కౌట్ కాలేదు..
పెద్ద బౌండరీ వైపు ఆడేలా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాలని ప్లాన్ రచించాం. కానీ ఈ వ్యూహం వర్కౌట్ కాలేదు. లెఫ్టార్మ్ బ్యాటర్లకు బదులు కుడిచేతి వాటం ఆటగాళ్లు ఎక్కువ సేపు క్రీజులో ఉన్నారు. పెద్ద బౌండరీ వైపు ఆడించేలా హుడాతో బౌలింగ్ చేయించాలనుకున్నా. కానీ ఆ అవకాశం రాలేదు. పేసర్లతోనే బౌలింగ్ చేయించాను. నాలుగో పేసర్ అందుబాటులో లేకపోవడంతోనే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాల్సి వచ్చింది. ఆవేశ్ ఖాన్ పూర్తిగా కోలుకోలేదు. సాధారణంగా మేం నలుగురు పేసర్లతో ఆడుతాం. అయితే టీ20 ప్రపంచకప్ ముందు కొత్తగా ప్రయత్నించాలనే ఉద్దేశంతో ముగ్గురు స్పిన్నర్లను తీసుకున్నాం.

ఈ ఓటమి మాకు ఓ గుణపాఠం..
జట్టుగా మాకున్న సందేహాలను ఈ టోర్నీ ద్వారా తీర్చుకోవాలనుకున్నాం. ఐదుగురు బౌలర్లతో ఆడితే ఎలా ఉంటుందనేది చూశాం. ఈ పరాజయాలతో దిగులు చెందాల్సిన అవసరం లేదు. మేం వరుసగా రెండు మ్యాచ్లు మాత్రమే ఓడిపోయాం. గత టీ20 ప్రపంచకప్ తర్వాత వరుస విజయాలు అందుకున్నాం. ఈ మ్యాచ్లు మాకు గుణపాఠం. కావాల్సిన విషయాలను నేర్పిస్తాయి. ఆసియాకప్ ఒత్తిడిలో మా సామర్థ్యం పరీక్షించుకోవాలనుకున్నాం. ఇప్పటీకీ మాకున్న సందేహాలు తీర్చుకోవాలనుకుంటున్నాం. మేం ఓడిన రెండు మ్యాచ్లు కూడా హోరాహోరీగా సాగినవనే విషయం మరవద్దు. డెత్ ఓవర్లలో అర్ష్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. చాహల్, భువనేశ్వర్ చాలా కాలంగా జట్టుకు విజయాలను అందిస్తున్నారు. యువ ఆటగాళ్ల నుంచి కూడా అదే ఆశిస్తున్నాం.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

ఆఖరి బంతి వరకు పోరాడినా..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లతో 72), సూర్యకుమార్ యాదవ్(29 బంతుల్లో ఫోర్, సిక్సర్తో 34) రాణించారు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక మూడు వికెట్లు తీయగా.. చమిక కరుణరత్నే, డసన్ షనక చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మహీశ్ తీక్షణ ఓ వికెట్ తీసాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 19.5 ఓవర్లలో 174 పరుగుల చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు పాతుమ్ నిస్సంక(37 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 52), కుశాల్ మెండిస్ (37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. భానుక రాజపక్స( 17 బంతుల్లో 2 సిక్సర్లతో 25 నాటౌట్), డసన్ షనక(17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్తో 33 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.


Click it and Unblock the Notifications
