టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఉబికి వస్తున్న దు:ఖాన్ని ఆపుకోలేక కన్నీటి పర్యంతమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ పేరుతో స్టాండ్ను ప్రారంభించిన సందర్భంగా రితికా సజ్దే ఏడ్చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి.
ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) వాంఖడే క్రికెట్ స్టేడియంలోని ఓ స్టాండ్కు రోహిత్ శర్మ పేరు పెట్టింది. ఈ స్టాండ్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో కలిసి రోహిత్ శర్మ తల్లిదండ్రులు పూర్ణిమా-గురునాథ్ శర్మలు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నేత శరద్ పవార్, భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్లతో పాటు రితికా సజ్దే కూడా హాజరైంది. స్టాండ్ ఆవిష్కరించే సమయంలో రితికా కళ్ల వెంబడి ఆనంద భాష్పాలు కారాయి. రోహిత్ శర్మ ప్రసంగ సమయంలోనూ ఆమె తన చేతులతో కన్నీటిని తుడుచుకోవడం కనిపించింది. ఈ వీడియోకు రోహిత్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రితికా సజ్దేపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

తన కుటుంబ సభ్యుల త్యాగాల వల్లే తనకు ఈ గౌరవం దక్కిందని రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. 'వాంఖడే స్టేడియంలో ఓ స్టాండ్కు నా పేరు పెడతారని నేను అస్సలు ఊహించలేదు. చిన్నప్పుడు ముంబై, టీమిండియా తరఫున ఆడాలని కోరుకున్నప్పుడు.. వీటి గురించి ఆలోచన కూడా చేయలేదు. ఆటలో సాధించిన మైలురాళ్ల కంటే ఇది ఎంతో ప్రత్యేకం. వాంఖడే స్టేడియంలో నాకు ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి.
గొప్ప ఆటగాళ్లు, రాజకీయ నేతల స్టాండ్స్ మధ్య నా పేరు ఉండటం మాటల్లో చెప్పలేని అనుభూతి. నాకు ఈ గౌరవాన్ని అందించిన ముంబై క్రికెట్ అసోసియేషన్కు కృతజ్ఞతలు. నేను రెండు ఫార్మాట్లకు వీడ్కోలు పలికాను. వన్డేల్లో ఆడుతున్నాను. ఐపీఎల్లో మే 21న ఢిల్లీతో జరిగే మ్యాచ్ కోసం ఇక్కడికి వస్తాను. అప్పుడు నాకు ప్రత్యేకమైన అనుభూతి దక్కుతుంది. ఈ మైదానంలో టీమిండియా తరఫున ఆడటం నాకు ప్రత్యేకంగా నిలవనుంది. మా కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ గౌరవాన్ని అందుకోవడం గొప్పగా ఉంది. మా అమ్మా నాన్న, నా సతీమణి, మా తమ్ముడు, మరదలు.. ఇలా కుటుంబమంతా నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. నా కోసం జీవితంలోని చాలా సంతోషాలను వారు దూరం చేసుకున్నారు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.