టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే ఖరీదైన ఫ్లాట్ను కొనుగోలు చేశారు. ముంబైలోని ప్రభాదేవీ ప్రాంతంలో రూ.26.30 కోట్ల భారీ ధర పెట్టి ఈ ఫ్లాట్ను తీసుకున్నారు. ఈ ఫ్లాట్ విస్తీర్ణం 2,760 స్క్వేర్ ఫీట్ కాగా.. స్టాంప్ డ్యూటీ కింద రూ.1.31 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.30 వేలు చెల్లించారు. అజింక్యా డీవై పాటిల్, పుజా అజింక్యా పాటిల్ అనే వ్యక్తుల నుంచి ఈ ఫ్లాట్ను కొనుగోలు చేశారు.
ప్రస్తుతం రోహిత్ శర్మ, రితికా సజ్డే నివాసం ఉంటున్న లగ్జరీ అహూజా టవర్స్లోనే ఈ ఫ్లాట్ ఉంది. రోహిత్ శర్మ దంపతులు కొన్నేళ్లుగా రియల్ఎస్టేట్లో భారీగా పెట్టబడులు పెడుతున్న విషయం తెలిసిందే.
గతంలో రితికా సజ్దే 'కార్నర్స్టోన్ స్పోర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్'లో స్పోర్ట్స్ మేనేజర్గా పనిచేశారు. సదరు సంస్థ తరఫున ఆమె పలువురు ప్రముఖ అథ్లెట్ల ఎండార్సమెంట్లు, బ్రాండ్ అసోసియేషన్లను పర్యవేక్షించారు. విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్తో పాటు రోహిత్ శర్మకు మేనేజర్గా పనిచేశారు. రోహిత్ శర్మ దగ్గర పనిచేస్తున్నప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించి పెళ్లికి దారి తీసింది. రోహిత్ శర్మతో పెళ్లి అయిన తర్వాత ఆమె తన ఫ్రొఫెషనల్ కెరీర్ను వదులుకొని ఇంటికే పరిమితమయ్యారు.

ముంబైలోని ప్రభాదేవి ప్రాంతం చాలా ఖరీదైన ప్రదేశం. వ్యాపార, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ప్రదేశంలో నివసిస్తుంటారు. లగ్జరీ హై-రైంజ్ అపార్ట్మెంట్లు, ప్రీమియం ఆఫీస్ స్పేస్లతో ప్రముఖ నివాస, వాణిజ్య ప్రాంతంగా మారింది.
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం రోహిత్ శర్మ సన్నదమవుతున్నాడు. ఇప్పటికే విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున బరిలోకి దిగిన ఓ సెంచరీ బాదిన రోహిత్ శర్మ.. నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అంతర్జాతీయ టీ20, టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన హిట్ మ్యాన్.. కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్.. ఫిట్నెస్ మెరుగుపరుచుకున్నాడు. ఏకంగా 10 కిలోలు తగ్గి ఫిట్గా తయారయ్యాడు.
జనవరి 11న వడోదర వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది. రోహిత్, కోహ్లీ ధాటికి ఈ మ్యాచ్ టికెట్లు ఆన్లైన్ వేదికగా 8 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి.