టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ముగిసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం రోహిత్ శర్మ సిద్దమయ్యాడు. ఈ టోర్నీ అనంతరం అతను అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీ అనంతరమే రోహిత్ శర్మ భవితవ్యంపై క్లారిటీ ఉంది. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించకపోయినా.. టెస్ట్ ఫార్మాట్కు రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఘోర పరాజయాలు..
గతేడాదిగా టెస్ట్ల్లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. అటు కెప్టెన్గా.. ఇట్టు బ్యాటర్గా తేలిపోయాడు. ఎన్నడూ లేని విధంగా ఘోర పరాజయాలను ఎదుర్కొన్నాడు. న్యూజిలాండ్తో సొంతగడ్డపై మూడు టెస్ట్ల సిరీస్లో టీమిండియా క్లీన్ స్వీప్ అయ్యింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై టీమిండియా వైట్ వాష్ అవ్వడం ఇదే తొలిసారి.

అనంతరం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా టీమిండియా 1-3తో కోల్పోయింది. రోహిత్ శర్మ గైర్హాజరీలో బుమ్రా సారథ్యంలో విజయం సాధించిన టీమిండియా.. ఆ తర్వాత ఘోర పరాజయాలను చవిచూసింది. చివరకు రోహిత్ శర్మనే ఆఖరి టెస్ట్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ ఘోర పరాజయాలతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ను కూడా దక్కించుకోలేకపోయింది.
15 ఇన్నింగ్స్ల్లో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ..
గత 15 టెస్ట్ ఇన్నింగ్స్ల్లో రోహిత్ శర్మ 164 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది. వరుసగా 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10 పరుగులతో దారుణంగా విఫలమయ్యాడు. గతేడాది 14 టెస్ట్లు ఆడిన రోహిత్.. 24.76 సగటుతో 619 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలతో పాటు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ పేలవ ప్రదర్శనతో రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలనే డిమాండ్ వ్యక్తమైంది. ఈ విమర్శలకు రోహిత్ శర్మ తన ఆటతో బదులిచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో శతకంతో చెలరేగి ఫామ్లోకి వచ్చాడు. వన్డేల్లో రాణించినా.. టెస్ట్ల్లో రోహిత్ కెరీర్ ముగిసినట్లేననే ప్రచారం జరుగుతోంది.
ఇంగ్లండ్ పర్యటనకు కెప్టెన్గా బుమ్రా..
ఈ ఏడాది జూన్ వరకు టీమిండియాకు టెస్ట్ సిరీస్లు లేవు. జూన్లో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు రోహిత్ శర్మ దూరమవుతాడని ఓ వార్త సంస్థ పేర్కొంది. రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్గా ఎంపిక చేయాలని అగార్కర్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బుమ్రా వెన్ను నొప్పితో భారత జట్టుకు దూరమయ్యాడు. అతను తిరిగి ఐపీఎల్ 2025 సీజన్తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బుమ్రా తన సారథ్య సామర్థ్యాన్ని చాటుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో రెండు టెస్ట్ల్లో జట్టును నడిపించి ఒక విజయాన్నందించాడు.