టీమిండియా బ్యాటింగ్ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ మాజీ క్రికెటర్లు చేసిన విమర్శలపై కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. ఓవర్సీస్లో బ్యాటింగ్ ఎలా చేయాలని, తమను విమర్శించే ముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలని హితవుపలికాడు. సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో టీమిండియా పేలవ బ్యాటింగ్, చెత్త బౌలింగ్తో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే.
రెండు ఇన్నింగ్స్ల్లో టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మినహా మరే బ్యాటర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. రోహిత్ శర్మ రెండు ఇన్నింగ్స్ల్లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే ఓవర్సీస్ పిచ్లపై ఎలా బ్యాటింగ్ చేయాలో భారత బ్యాటర్లకు తెలియడం లేదని మాజీ క్రికెటర్లు విమర్శించారు.

పేస్ బౌలింగ్ను ఎదుర్కొనేందుకు టీమిండియా ఆటగాళ్లు తంటాలు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలపై స్పందించిన రోహిత్ శర్మ.. విదేశాల్లో ఎలా ఆడాలో? తమకు తెలుసని, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డపై తాము సాధించిన విజయాలు గుర్తు చేసుకోవాలన్నాడు.
'సౌతాఫ్రికాతో తొలి టెస్ట్లో మేం విఫలమయ్యాం. అలాగని గతాన్ని మరిచిపోయి మాట్లాడటం సరికాదు. మేం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను వారి గడ్డపైనే ఓడించి సిరీస్లను గెలిచాం. ఒక సిరీస్ను డ్రా చేసుకున్నాం. మా బ్యాటర్లు, బౌలర్లు సత్తా చాటడంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. అయితే కొన్నిసార్లు ఇలాంటి ఫలితాలు కూడా ఎదురవుతాయి.
అలాగని భారత్ వెలుపల బ్యాటింగ్ ఎలా చేయాలనేది మాకు తెలియక కాదు. ప్రత్యర్థులు అత్యుత్తమంగా ఆడినప్పుడు వారు గెలుస్తారు. సౌతాఫ్రికాతో టెస్ట్లోనూ ఇదే జరిగింది. ప్రత్యర్థి బ్యాటర్లు 110 ఓవర్లపాటు బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత మేం రెండు ఇన్నింగ్స్ల్లోనూ రాణించలేకపోయాం. దీనిపై వ్యాఖ్యలు చేసే ముందు మేం పర్యటించిన గత నాలుగు సిరీస్ల గణంకాలను కూడా పరిశీలించాలి. బ్యాటింగ్, బౌలింగ్ రికార్డులను తెలుసుకోవాలి'అని చెప్పుకొచ్చాడు.
తొలి టెస్ట్లో దారుణంగా విఫలమైన టీమిండియా.. రెండో మ్యాచ్ కోసం రెడీ అవుతోంది. జనవరి 3 నుంచి కేప్టౌన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. వెన్ను నొప్పితో తొలి టెస్ట్కు దూరమైన రవీంద్ర జడేజా ఈ మ్యాచ్కు అందుబాటులోకి వచ్చాడు.