టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. అప్కమింగ్ ఆస్ట్రేలియా టూర్లో భాగంగా జరిగే మూడు వన్డేల సిరీస్తో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.
ఈ పర్యటనకు సంబంధించిన భారత జట్టును చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ శనివారం ప్రకటించే అవకాశం ఉంది. జట్టు ప్రకటనకు ముందు సెలెక్టర్లు వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ జట్టు అవసరాలు, కెప్టెన్సీ విషయంపై రోహిత్తో చర్చించనున్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. రోహిత్ శర్మ అభిప్రాయం తర్వాతే భారత జట్టును ప్రకటించనున్నారు. కొత్త తరానికి అవకాశం ఇచ్చే క్రమంలో హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తరఫున చివరిసారిగా ఆడిన రోహిత్, కోహ్లీ.. ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్ ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. చివరిసారిగా ఐపీఎల్లో అభిమానులకు రోహిత్, కోహ్లీలు కనిపించారు. 2022లో వన్డే సారథ్య బాధ్యతలు స్వీరించిన రోహిత్ శర్మ..జట్టుకు అద్భుత విజయాలు అందించాడు.
2023 వన్డే ప్రపంచకప్లో ఓటమెరుగని జట్టుగా టీమిండియాను ఫైనల్ చేర్చాడు. కానీ ఆస్ట్రేలియా చేతిలో భారత్కు ఊహించని పరాజయం ఎదురైంది. దాంతో వన్డే ప్రపంచకప్ అందించాలనే అతని కల నెరవేరలేదు. 2027 వన్డే ప్రపంచకప్ టీమిండియాకు అందించడమే తన లక్ష్యమని రోహిత్ చెప్పుకొచ్చాడు. కానీ టీమ్మేనేజ్మెంట్ అతనికి ఆ అవకాశం ఇస్తుందా? లేదా? అనేది చూడాలి. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.