ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత సెలెక్టర్లను మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ హెచ్చరించాడు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్తోనే రోహిత్ శర్మ ఫామ్పై ఓ అభిప్రాయానికి రావడం సరికాదన్నాడు. విరాట్ కోహ్లీ తరహాలోనే రోహిత్ శర్మ ఎప్పుడూ నిలకడగా రాణించలేదన్నాడు. కానీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడని గుర్తు చేశాడు.
టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్తో ఈ ఇద్దరూ స్టార్లు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మ తప్పించి శుభ్మన్ గిల్ను కొత్త సారథిగా నియమించారు.
దాంతో మెరుగైన ప్రదర్శన చేస్తేనే జట్టులో కొనసాగుతారని కోహ్లీ, రోహిత్కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్తోనే కోహ్లీ, రోహిత్పై ఓ అంచనాకు రావడం సరికాదని కైఫ్ అభిప్రాయపడ్డాడు. వన్డే ప్రపంచకప్ 2027లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆడటం టీమిండియాకు కీలకమని చెప్పాడు.

'ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ ఫామ్ను పరిశీలిస్తారని అంటున్నారు. కానీ రోహిత్ శర్మకు కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే రోహిత్ ప్రస్తుతం కెప్టెన్ కాదు. అతను ఏనాడు కూడా నిలకడగా రాణించింది లేదు. 20, 30 పరుగులే చేస్తాడు. కానీ బిగ్ మ్యాచ్ వచ్చినప్పుడు విన్నింగ్ నాక్ ఆడుతాడు. అతని కెరీర్ మొత్తం అలానే సాగింది.
రోహిత్తో పోల్చితే కోహ్లీనే నిలకడగా ఆడాడు. కానీ రోహిత్ తనదైన రోజున మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేస్తాడు. కాబట్టి ఒక్క ఆస్ట్రేలియా సిరీస్తో రోహిత్ ఫామ్ను అంచనా వేయడం కష్టం. ఒకవేళ ఈ సిరీస్లో రోహిత్ విఫలమైతే.. అతను ఫామ్లో లేడని విమర్శలు గుప్పిస్తారు. కానీ మీరు అతను కెరీర్ను పరిశీలిస్తే అతను తరుచుగా రెండు, మూడు ఇన్నింగ్స్ల్లో విఫలమై.. ఆ తర్వాత బలంగా తిరిగి వస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతను ఆరంభ మ్యాచ్ల్లో 30, 40 పరుగులు చేసాడు. కానీ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
వన్డే ప్రపంచకప్ 2027లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఆడించాలి. మెగా టోర్నీల్లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అవసరం. వారికి సరైన గౌరవం దక్కలేదని భావించడం, రిటైర్మెంట్ తీసుకోవడం వారి వ్యక్తిగత నిర్ణయం. కానీ వారిద్దరూ ప్రపంచకప్ ఆడితే భారత్ గౌరవం పెరగుతుంది. అంతేకాకుండా వారి నుంచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు వస్తాయి. నా ఏకైక విజ్ఞప్తి ఏంటంటే.. రెండు లేదా మూడు ఇన్నింగ్స్ల ఆధారంగా వారిని అంచనా వేయవద్దు.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.