భారత వెటరన్ ప్లేయర్స్ అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్ కోచ్లుగా జట్టులోకి పునరాగమనం చేస్తారా? అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ ఇచ్చిన సమాధానం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. రహానే, పుజారాలు రిటైర్మెంట్ ప్రకటించలేదంటూ సదరు జర్నలిస్ట్ను రోహిత్ తనదైన శైలిలో ఆడుకున్నాడు. దాంతో మీడియా సమావేశంలో నవ్వులు పూసాయి.
భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్ట్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. రోహిత్ శర్మతో మీడియా సమావేశంలో పాల్గొని మరి తన నిర్ణయాన్ని వెల్లడించాడు.

అశ్విన్ రిటైర్మెంట్ నేపథ్యంలో రోహిత్ శర్మపై మీడియా ప్రతినిథులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ బోర్డర్ గవాస్కర్ సిరీస్లో ఇలాంటి ఆశ్చర్యకరమైన ప్రకటనలు ఇంకా ఏమైనా వస్తాయా? అని రోహిత్ రిటైర్మెంట్ను ఉద్దేశించి ప్రశ్నించారు. దీనికి రోహిత్ ఎలాంటి సర్ప్రైజ్లు రావాలని స్పష్టం చేశాడు.
ఆ తర్వాత అశ్విన్, రహానే, పుజారాలను మిస్సవుతారా? ఈ ముగ్గురు కోచ్లుగా భారత జట్టులోకి పునరాగమనం చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. దీనికి రోహిత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. కొన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడుగుతారని, పుజారా, రహానే రిటైర్ అవ్వలేదని రోహిత్ గుర్తు చేశాడు.
'మనతో కలిసి చాలా కాలం ఆడిన ఆటగాళ్లు ఒక్కొక్కరిగా వీడ్కోలు పలకుతుంటే వినూత్నమైన ఫీలింగ్ కలుగుతోంది. కానీ మనం ఏం చేయలేం. పుజారా, రహానే జట్టుకు దూరమైనా.. మేం మంచి స్నేహితులం. కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లకపోయినా.. ఆడకపోయినా.. కలుస్తూనే ఉంటాం. రహానే ముంబైలోనే ఉంటాడు. తరుచుగా కలుస్తూనే ఉంటాడు. పుజారా రాజ్కోట్లో దాక్కుంటాడు. అయినా అతన్ని మేం పట్టుకుంటాం.
ఈ ఇద్దరూ ఎన్నో పరుగులు చేశారు. ఎన్నో మ్యాచ్ల్లో భారత్ను గెలిపించారు. కాబట్టి వాళ్లని మేం మిస్సవుతాం. అయితే రహానే, పుజారా ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. వారు ఇక్కడ లేరు అంతే. వారికి ఇంకా టీమిండియా డోర్స్ తెరిచే ఉన్నాయి. మీరు నన్ను ఇబ్బందుల్లో పెట్టేందుకు ఈ ప్రశ్న అడిగారు.'అని రోహిత్ శర్మ బదులిచ్చాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి.