టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు గుడ్బై చెప్పాడు. ముఖ్యంగా తనకు అచ్చొచ్చిన సిడ్నీ నగరానికి వీడ్కోలు పలికాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను రోహిత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 'చివరిసారిగా సిడ్నీ నగరానికి వీడ్కోలు చెబుతున్నాను'అనే క్యాప్షన్తో గుడ్ బై చెబుతున్న ఫొటోను షేర్ చేశాడు.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఆల్టైమ్ గ్రేట్, సిడ్నీ కింగ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సిడ్నీ గ్రౌండ్లో మూడు ఫార్మాట్లలో కలిపి 13 ఇన్నింగ్స్లు ఆడిన రోహిత్ శర్మ.. 62.66 సగటుతో 6 హాఫ్ సెంచరీలు, 2 శతకాలతో 752 పరుగులు చేశాడు. ఈ మైదానంలో 64 ఫోర్లతో పాటు 24 సిక్స్లు బాదాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ గ్రౌండ్ వేదికగానే జరిగిన ఆఖరి టెస్ట్కు తుది జట్టు నుంచి స్వయంగా తప్పుకున్న రోహిత్ శర్మ.. తాజా పర్యటనలో ఇదే మైదానంలో సెంచరీతో జట్టుకు విజయాన్నందించాడు. దాంతో ఎక్కడా తగ్గాడో అక్కడే నిలబడ్డాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్లో విఫలమైన రోహిత్.. రెండో మ్యాచ్లో హాఫ్ సెంచరీ, మూడో మ్యాచ్లో సెంచరీతో చెలరేగాడు. తద్వారా హయ్యెస్ట్ రన్ స్కోరర్గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్తో పాటు చివరి మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ ధన్యవాదాలు తెలిపాడు.
'నాకు ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఎప్పుడూ ఇష్టమే. సిడ్నీ వేదికగా ఆడటం సంతోషంగా ఉంటుంది. నా తొలి ఆసీస్ పర్యటన 2008 నుంచి మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ పర్యటన కూడా చాలా సరదాగా గడిచింది. మేం మళ్లీ క్రికెటర్లుగా ఆసీస్కు వస్తామో లేదో తెలియదు. కానీ నేను ఈ గడ్డపై ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. గత 15 ఏళ్లలో మేం సాధించిన ఘనతల కంటే క్రికెట్ ఆడటాన్ని ఎక్కువగా ఆస్వాదించాం. ఆసీస్ గడ్డపై ఆడటం నాకు ఎప్పుడూ ఇష్టమే. విరాట్ కోహ్లీకి కూడా ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. ఆస్ట్రేలియాకు ధన్యవాదాలు'అని రోహిత్ తెలిపాడు.