టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలుకుతాడని అతని చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ అన్నాడు. వన్డే క్రికెట్లో కొనసాగేందుకు రోహిత్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, అతను 2027 వన్డే ప్రపంచకప్ ఆడే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు.
ఇటీవల టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన అనంతరం రోహిత్ శర్మ.. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా.. తదుపరి 8 మ్యాచ్ల్లో 3 విజయాలు సాధిస్తే ఫైనల్ చేరుతోంది. ఈ టోర్నీ ఫైనల్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెబుతాడని జోరు ప్రచారం జరుగుతుంది. 37 ఏళ్ల వయసున్న రోహిత్.. టీమిండియాకు మరో ఐసీసీ టైటిల్ అందించి గుడ్బై చెబుతాడని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అతని చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'రోహిత్ శర్మ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అంటే అవునని కచ్చితంగా చెప్పలేను. కానీ వయసు మీద పడుతున్నందున టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెబుతాడనిపిస్తోంది. వన్డే క్రికెట్లో కొనసాగేందుకు.. పూర్తిగా ఫిట్గా ఉండటం కోసం అతను ఈ నిర్ణయం తీసుకోవచ్చు. రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్లో ఆడుతాడని నేను 100 శాతం నమ్ముతున్నా. ప్రస్తుతం రోహిత్ సూపర్ ఫామ్లో ఉన్నాడు.'అని దినేశ్ లాడ్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం రోహిత్ వెకేషన్లో ఉన్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్లో ఎంజాయ్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్తో రెండు టెస్ట్ల సిరీస్ను 2-0తో కైవసం చేసుకున్న రోహిత్ సేన.. ఈ నెల 16న న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్తో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనుంది. మరోవైపు బంగ్లాదేశ్తో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యంగ్ ఇండియా టీ20 సిరీస్ ఆడుతోంది. పొట్టి ఫార్మాట్కు టెస్ట్ సిరీస్ ఆడిన ఆటగాళ్లను దూరంగా ఉంచారు. దాంతో వారంత కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు.