
అహ్మదాబాద్: సారథ్యంలో దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని తలపించే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురయ్యాడు. కూల్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్న హిట్ మ్యాన్.. వెస్టిండీస్తో బుధవారం జరిగిన రెండో వన్డేలో సహనం కోల్పోయాడు. భారత వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్పై గుస్సా అయ్యాడు. ఫీల్డింగ్ మారుస్తున్న రోహిత్ శర్మను చాహల్ ఇరిటేట్ చేశాడు. ఫీల్డ్ పోజిషన్ మారాలని రోహిత్ చేసిన సూచనలను చాహల్ లైట్ తీసుకోవడంతో గట్టిగానే మందలించాడు. రోహిత్ అన్న వ్యాఖ్యలు స్టంప్ మైక్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
వెస్టిండీస్ ఇన్నింగ్స్ 45వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వాషింగ్టన్ సుందర్ ఈ ఓవర్ వేయడానికి సిద్దమవ్వగా.. రోహిత్ ఫీల్డ్లో కొన్ని మార్పులు చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే యుజ్వేంద్ర చాహల్ను లాంగాఫ్కు వెళ్లాలని సూచించాడు. అయితే చాహల్ మాత్రం రోహిత్ సూచనలతో నెమ్మదిగా కదిలాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన హిట్ మ్యాన్..'ఏమైంది నీకు.. ఎందుకు పరుగెత్తడం లేదు? త్వరగా అక్కడికి వెళ్లి ఫీల్డింగ్ చేయ్'అని మందలించాడు. రోహిత్ ఆగ్రహాన్ని అర్థం చేసుకున్న చాహల్.. త్వరగా పరుగెత్తాడు.
ఈ మ్యాచ్లో 44 రన్స్ తేడాతో గెలిచిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్లో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (83 బంతుల్లో 64; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. అనంతరం వెస్టిండీస్ 46 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. షామర్ బ్రూక్స్ (64 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' ప్రసిధ్ కృష్ణ (4/12) ప్రత్యర్థిని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-0తో గెలుచుకోగా, రేపు చివరి వన్డే జరుగుతుంది.