టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీ ఆడేందుకు సిద్దమయ్యారు. ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానుంది. టీ20 ఫార్మాట్కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించగా.. ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్కు యశస్వి జైస్వాల్ను ఎంపిక చేయలేదు. దాంతో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ ఆడేందుకు రెడీ అయ్యారు.
అందుబాటులో ఉన్న టీమిండియా ఆటగాళ్లు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిబంధన పెట్టడంతో ఈ స్టార్ ఆటగాళ్లు ముంబై తరఫున బరిలోకి దిగుతున్నారు. జనవరి 23(గురువారం) నుంచి జమ్ము కశ్మీర్తో జరిగే మ్యాచ్కు ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు అజింక్యా రహానే సారథ్యంలో ఆడనున్నారు. ఈ మ్యాచ్లో బరిలోకి దిగే ముంబై జట్టును ముంబై క్రికెట్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది.

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ రాకతో యువ ఓపెనర్ పృథ్వీ షా జట్టులో అవకాశాన్ని అందుకోలేకపోయాడు. ఫిట్నెస్ సమస్యలతో పాటు పేలవ ఫామ్తో బాధపడుతున్న అతన్ని సెలెక్టర్లు పట్టించుకోలేదు. 10 ఏళ్ల క్రితం 2015లో రోహిత్ శర్మ చివరిసారిగా రంజీ ట్రోఫీ ఆడాడు.
ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్లు ఐదు ఇన్నింగ్స్ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో అతనిపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలోనే టీమిండియా ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ రూల్ తీసుకొచ్చింది.
అయితే కిక్కిరిసిన షెడ్యూల్ కారణంగానే తాము దేశవాళీ క్రికెట్ ఆడలేకపోయామని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే భారత జట్టును ప్రకటించిన అనంతరం రోహిత్ శర్మను రంజీ ట్రోఫీ గురించి ప్రశ్నించగా.. తనదైన శైలిలో బదులిచ్చాడు. తాము మనుషులమేనని, రిఫ్రెష్ అయ్యి.. ప్రశాంతంగా ఆటపై ఫోకస్ పెట్టేందుకు బ్రేక్ కావాలన్నాడు. 2019 నుంచి తాను రెగ్యులర్గా టెస్ట్ క్రికెట్ ఆడుతున్నానని చెప్పిన రోహిత్.. అప్పటి నుంచి తీరిక లేని షెడ్యూల్తో గడిపామని చెప్పాడు. ప్రస్తుతం టైమ్ ఉంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని తప్పనిసరి చేశారన్నాడు.
ముంబై జట్టు: అజింక్యా రహానే(కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, ఆయుష్ మాత్రే, శ్రేయస్ అయ్యర్, సిద్దేష్ లాడ్, శివమ్ దూబే, హార్దిక్ తమోర్(కీపర్), ఆకాశ్ ఆనంద్(కీపర్), తనుష్ కోటియన్, షామ్స్ ములాని, హిమాన్షు సింగ్, శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, సిల్వెసర్ డిసౌజా, రోస్టన్ డియస్, కర్ష్ కోటరీ