టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలుగులో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం విశ్రాంతిలో ఉన్న రోహిత్ శర్మ.. అమెరికాలో పర్యటిస్తున్నాడు. తాజాగా డల్లాస్లో నిర్వహించిన ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు. అక్కడ తెలుగు అభిమానులు ఎక్కువగా ఉండటంతో వారిని ఉద్దేశించి రోహిత్ శర్మ ప్రత్యేకంగా మాట్లాడాడు.
హిట్మ్యాన్ స్టేజీపై ఉండగా ఓ వ్యక్తి తెలుగులో ఎట్లా ఉన్నారు? అని అడిగారు. అతని మాటలు విన్న రోహిత్ 'ఎట్లా ఉన్నారు?'అంటూ నవ్వుతూ బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోకు తెలుగు అభిమానులు ఫిదా అవుతున్నారు.

రోహిత్ శర్మకు తెలుగు తెలుసు అనే విషయం తెలిసిందే. హిట్ మ్యాన్ తల్లి పూర్ణిమ శర్మది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం. తండ్రి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. దీంతో రోహిత్కు మరాఠీయే మాతృభాష అయినా.. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ కూడా బాగా వస్తుంది.
టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ.. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో కొనసాగుతానని స్పష్టం చేశాడు. 'నేను ఎక్కువగా ఆలోచించను. ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. కొంతకాలం వన్డే, టెస్ట్ ఫార్మాట్లలో నా ఆట చూస్తారు'అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
రోహిత్ శర్మ వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్తో పాటు వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీలోనూ భారత కెప్టెన్గా వ్యవహరిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నెలాఖరులో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేల కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనతోనే టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన బాధ్యతలను స్వీకరించనున్నాడు. టీ20 సిరీస్తో పాటు వన్డే సిరీస్కు ఫస్ట్ ఛాయిస్ ఆటగాళ్లను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. శ్రీలంక పర్యటనతో మైదానంలోకి రీఎంట్రీ ఇస్తారా? లేక ఈ పర్యటన నుంచి కూడా వారికి విశ్రాంతి కల్పిస్తారా? అనే విషయంపై క్లారిటీ లేదు. మరో రెండు రోజుల్లో ఈ పర్యటనకు వెళ్లే భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.