టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తనయుడికి అహాన్ శర్మ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని రోహిత్ సతీమణి రితికా సజ్దే ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. డిసెంబర్ నెల వచ్చేసింది అంటూ క్రిస్మస్ శాంటా గెటప్లో ఉన్న ఓ ఫ్యామిలీ బొమ్మల ఫొటోను ఆమె షేర్ చేశారు.
ఈ ఫొటోలో రో( రోహిత్), రిట్స్(రితికా), సమ్మీ(సమైరా) బొమ్మలతో పాటు తమ వారసుడు అహన్ బొమ్మ కూడా ఉంది. నవంబర్ 15న రోహిత్-రితికాలను అహన్ జన్మించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ తరహాలోనే రోహిత్-రితికాలు కూడా తమ కొడుకు ఫొటోను ఇంకా విడుదల చేయలేదు.

అహన్ కోసమే రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు ఆలస్యం వెల్లాడు. ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్కు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. రితిక సజ్దే ప్రసవ సమయంలో ఆమె పక్కనే ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. రోహిత్ శర్మ గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా టీమిండియాను నడిపించాడు.
సంచలన బౌలింగ్తో ఆసీస్ గడ్డపై టీమిండియాకు బుమ్రా చారిత్రాత్మక విజయాన్నందించాడు. పెర్త్ పిచ్ను సరిగ్గా రీడ్ చేసిన బుమ్రా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ ఆసీస్ బౌలర్లు నిప్పులు చెరగడంతో భారత్ 150 పరుగులకే కుప్పకూలింది. దాంతో బుమ్రా నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. కానీ బుమ్రా సంచలన బౌలింగ్తో ఐదు వికెట్లు తీసి ఆసీస్ను తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకే ఆలౌట్ చేశాడు.
దాంతో భారత్కు 46 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ సెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ ముందు 534 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. ఆసీస్ మాత్రం భారత బౌలర్ల ధాటికి 238 పరుగులకే కుప్పకూలి 295 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ గెలుపుతో 5 టెస్ట్ల సిరీస్లో టీమిండియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
శుక్రవారం నుంచి అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్కు ముందు భారత్.. పీఎమ్ ఎలెవన్తో గులాబీ బంతితో సన్నాహక మ్యాచ్ ఆడుతుంది. తొలి టెస్ట్కు దూరమైన రోహిత్ శర్మకు ఈ పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ కీలకంగా మారింది. మ్యాచ్ ప్రాక్టీస్తో పాటు ఫామ్ అందుకునేందుకు ఈ మ్యాచ్ను ఉపయోగించుకోవాలని హిట్ మ్యాన్ భావిస్తున్నాడు.